నగరానికి చెందిన సీహెచ్ దుర్గారావు దివ్యాంగుడు. గతంలో బీసెంట్ రోడ్డులో చిరు వ్యాపారం చేసుకుంటూ బతికేవాడు. అనారోగ్యం కారణంగా ఒక కాలిని తొలగించి కృత్రిమ కాలు అమర్చారు. దీంతో జీవనోపాధికి ఏ పనీ చేయలేకపోతున్నాడు. కుటుంబ సభ్యులు పట్టించుకోని స్థితిలో దివ్యాంగ పింఛను కోసం అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. దీపావళి పండుగ రోజున సీఎం చంద్రబాబు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆకస్మిక పర్యటన అంటూ విజయవాడ బీసెంట్ రోడ్డుకు వచ్చారు. హాకర్లతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకునేందుకు వచ్చారు. దుర్గారావు సీఎం చంద్రబాబును కలిసి అర్జీ ఇచ్చాడు. ‘నీకు వెంటనే పెన్షన్, సొంత ఇల్లు మంజూరు చేయిస్తా. జీవనోపాధి కూడా కల్పిస్తా’ అంటూ కెమెరాల సాక్షిగా వరాలు కురిపించారు. పబ్లిసిటీ కోసం మంచిగా ఫొటోలు, వీడియోలు తీయించుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయించారు. ముఖ్యమంత్రే హామీ ఇచ్చాక అధికారులు కాదంటారా అని దుర్గారావు సంబరపడ్డాడు. అప్పటినుంచి ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం అన్నట్టుగా అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ‘సీఎం వరమిచ్చినా న్యాయం జరగలేదు’ అని రాసిన ఫ్లెక్సీతో కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చాడు.
– నడిపూడి కిషోర్,
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ


