కలెక్టర్ లక్ష్మీశ జిల్లా స్థాయి పీజీఆర్ఎస్కు 153 అర్జీలు
రైతులు సాగు చేసే భూములకు పట్టాలు ఇవ్వాలి
– ఎ. కొండూరు మండలం కోమటికుంట రైతులు
తొలగించిన కార్మికులను
విధుల్లోకి తీసుకోవాలి
– జల్లి విల్సన్ , మాజీ ఎమ్మెల్సీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్ఎస్లో వచ్చే ప్రతి అర్జీని నిర్దేశ గడువులో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
మొత్తం 153 అర్జీలు
జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 153 అర్జీలు అందాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వీటిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 62, పోలీసు 16, పంచాయతీరాజ్కు 13, రెవెన్యూకు 9, విభిన్న ప్రతిభావంతుల శాఖకు 6, పౌరసరఫరాల శాఖకు 5, డీఆర్డీఏకు 4 అర్జీలు వచ్చాయన్నారు. పశుసంవర్ధక, గృహ నిర్మాణం, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు మూడు చొప్పున అర్జీలు వచ్చాయన్నారు. విద్యుత్, విద్య, మార్కెటింగ్, మైన్స్, సాంకేతిక విద్య, కలెక్టరేట్ కోఆర్డినేషన్, డీసీహెచ్ఎస్ విభాగాలకు రెండు చొప్పున అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజా రవాణా, దేవదాయ, మత్స్య, భూగర్భ జలాలు, ఐసీడీఎస్, కార్మిక, మెప్మా, కాలుష్యం, రీజనల్ ఇంటర్మీడియెట్ ఆఫీసర్ (ఆర్ఐవో), రహ దారులు–భవనాలు, సాంఘిక సంక్షేమం, జలవనరులు శాఖలకు ఒక్కో అర్జీ వచ్చినట్లు తెలిపారు.
ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం శివారు కోమటికుంట గ్రామంలో 175 ఎకరాల అటవీ భూమిని దశాబ్దాలుగా 250 కుటుంబాలు సాగుచేసుకుంటున్నాయి. జిల్లాలో ఉన్నతస్థాయి కమిటీ వేసి వీటికి పట్టాలు ఇవ్వాలి.
ఆర్డబ్ల్యూఎస్ మైలవరం పైలట్ ప్రాజెక్టు మెయింట్నెన్స్ వర్క్స్ కాంట్రాక్ట్ తీరుపై పీజీఆర్ఎస్లో జేసీకి అర్జీ సమర్పించాం. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులతో పాటు, సూపర్వైజర్ను తొలగించారు. వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. దీనిపై జాయింట్ కలెక్టర్తో మాట్లాడాం.


