కంకిపాడు: జాతీయ రహదారిపై రెండు లారీ లు ఢీకొన్న సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం...విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న సిమెంటు లోడు లారీ కంకిపాడు బైపాస్ మార్గంలోకి రాగానే లారీ టైరు పంక్చర్ అయ్యింది. దీంతో లారీ డ్రైవరు లారీని నిలిపివేశాడు. ఇదే మార్గంలో కంకరు లోడుతో వెళ్తున్న టిప్పరు సిమెంటు లోడు లారీని వెనుకగా వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో టిప్పరు ఇంజిను భాగం పూర్తిగా ధ్వంసమైంది. లారీ డ్రైవరు కేబిన్లో ఇరుక్కుపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సుమారు అరగంట పాటు కష్టపడి కేబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవరును అతికష్టం మీద బయటకు లాగారు. గాయాలపాలైన డ్రైవరు ఘంటసాల మండలం అచ్చంపాలెంకు చెందిన తుమ్మపూడి నవీన్ (32)ను 108 అంబులెన్సులో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. స్థానిక పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.


