
వక్ఫ్ భూములను ముస్లింల సంక్షేమానికి వినియోగిస్తాం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను కాపాడి వాటిని ముస్లింల సంక్షేమానికి వినియోగిస్తామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలో వక్ఫ్ బోర్డు భూములను ఆయన శనివారం పరిశీలించారు. ఎన్టీటీపీఎస్ పరిధిలో ఉన్న వక్ఫ్ బోర్డు భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీటీపీఎస్ నుంచి వక్ఫ్ భూములకు సంబంధించి బోర్డుకు ఎలాంటి ప్రయోజనాలు లభించడం లేదని స్థానిక ముస్లిం నాయకులు వివరించారు. అల్తాఫ్ రజా వక్ఫ్ బోర్డ్ చైర్మన్కు అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూముల వివరాలను, వాటి గురించి చేస్తున్న పోరాటాలను తెలియజేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ అక్రమ్, సీఈఓ మహమ్మద్ అలీ, ముస్లిం మైనార్టీ నాయకులు ఫతావుల్లా, మసూద్ అలీ జిన్నా తదితరులు పాల్గొన్నారు.
మోపిదేవి ఆలయంలో ఆర్వో ప్లాంట్లు ప్రారంభం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలో దివీస్ లెబోరేటరీస్ లిమిటెడ్ రూ.32 లక్షలతో ఏర్పాటు చేసిన రెండు ఆర్వో ప్లాంట్లను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శనివారం ప్రారంభించారు. దివీస్ ల్యాబ్ ప్రతినిధులు నగేష్, శ్రీనివాస్ను ఆలయ ఈఓ శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో వేద పండితులు ఘనంగా సత్క రించారు. ఆశీర్వచనాలు అందజేసి స్వామి చిత్రపటం బహూకరించారు. భక్తుల కోరిక మేరకు దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానాన్ని టీటీడీ కల్యాణ మండపంలోకి మార్చి, ఆక్కడ నిర్వహిస్తున్న అన్నప్రాశన, అక్షరాభ్యాసం, పాల పొంగళ్లు, చెవుల కుట్టు పోగుల సేవలను దేవస్థానం ప్రాంగణంలోకి మార్చనున్నట్లు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తెలిపారు.
23, 24 తేదీల్లో చలో ఢిల్లీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనగణనతోపాటు కుల గణన చేపట్టాలని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గానరేష్ డిమాండ్ చేశారు. బీసీల జనగణన, రిజర్వేషన్లు, ఇతర సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23, 24 తేదీల్లో చలో ఢిల్లీ చేపట్టనున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రెస్క్లబ్లో ఆయన శనివారం చలో ఢిల్లీ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23, 24 తేదీల్లో ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామని, వాటిలో బీసీ ఎంపీలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బీసీ నేతలు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భీమవరపు హేమ, బీసీ సంక్షేమ సంఘం స్టేట్ యూత్ కన్వీనర్ రంగు విక్రమ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పోతిన వరప్రకాష్, పిల్లా దినేష్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతోనే అభివృద్ధి
వీరులపాడు: ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని పంచా యతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ పేర్కొన్నారు. సమిత్వా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన మండలంలోని పొన్నవరంలో ఇంటి నిర్మాణాలు, సరిహద్దులకు సంబంధించి నివాస గృహాల యజమానులతో శనివారం ప్రత్యేక సమావేశం జరిగింది. కృష్ణతేజ మాట్లాడుతూ.. గ్రామంలోని ఇళ్లు, వాటి హద్దుల పూర్తి వివరాలతో కూడిన పత్రాన్ని యజమానులకు అందిస్తామన్నారు. అనంతరం పాఠశాలను పరిశీలించి అదనపు గదుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు నెలలుగా వేతనాలు రావటం లేదని, ఉద్యోగ భద్రత కల్పించి, జీతాలు పెంచాలని కోరుతూ ఫీల్డు అసిస్టెంట్ల సంఘ నాయకులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ రాజు పాల్గొన్నారు.

వక్ఫ్ భూములను ముస్లింల సంక్షేమానికి వినియోగిస్తాం