సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి నాగపడగ సమర్పణ | - | Sakshi
Sakshi News home page

సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి నాగపడగ సమర్పణ

Jun 28 2025 8:57 AM | Updated on Jun 28 2025 8:57 AM

సుబ్ర

సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి నాగపడగ సమర్పణ

మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి దర్శి వాస్తవ్యులు యారాశి శ్రీకాంత్‌ రెడ్డి, చంద్రిక కుటుంబ సభ్యులు వెండి నాగపడగను శుక్రవారం సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్నవారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్‌ బొప్పన సత్యనారాయణకు 550 గ్రాములు.. సుమారు రూ. 60 వేలతో చేయించిన నాగపడగను స్వామివారి కానుకగా అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో అధికారులు సత్కరించారు. దాతలకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

సచివాలయ కార్యదర్శుల బదిలీలు షురూ

మచిలీపట్నంటౌన్‌: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, 8 మున్సిపాలిటీల పరిధిలో వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న పలు విభాగాల కార్యదర్శుల బదిలీ ప్రక్రియను శుక్రవారం మచిలీపట్నం మునిసిపల్‌ కార్యాలయంలోని పాత కౌన్సిల్‌ హాల్లో ప్రారంభించారు. బదిలీ కమిటీ చైర్మన్‌, నగర కమిషనర్‌ సీహెచ్‌వీవీఎస్‌ బాపిరాజు, డీఎంఏ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ నాగభూషణం పర్యవేక్షణలో ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో జరిగింది. కార్యదర్శులుగా ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసిన వారిని తప్పని సరిగా బదిలీ చేయడానికి జాబితాలు సిద్ధం చేశారు. సీనియారిటీ, వయసు, ప్రజాప్రతినిధుల సిఫార్సులు, రిక్వెస్టులను పరిశీలించి శుక్రవారం రాత్రికి బదిలీ జాబితాను పూర్తిచేయడానికి కసరత్తు చేస్తున్నారు. కార్యదర్శులు ప్రస్తుతం పని చేస్తున్న వార్డు, నివసించే వార్డు కాకుండా ఇతర వార్డులకు బదిలీ చేయనున్నారు.

ఐసీఈయూ ప్లాటినం జూబ్లీ లోగో ఆవిష్కరణ

మచిలీపట్నంటౌన్‌: భారత దేశ బీమా రంగ ట్రేడ్‌ యూనియన్‌ అల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ను ఏర్పాటుచేసి జూలై 1వ తేదీ నాటికి, 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ సంఘ ప్లాటినం జూబ్లీ లోగోను నాయకులు శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు. స్థానిక ఎల్‌ఐసీ డివిజనల్‌ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆ సంఘ మచిలీపట్నం డివిజన్‌ ప్రధాన కార్యదర్శి కిషోర్‌, నేతలు జె.సుధాకర్‌, డి.వాసు, ఎల్‌.రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన ఉరుసు

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లిలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కాలేషా వలి బాబా ఉరుసు మహోత్సవం గురువారం రాత్రి ముగిసింది. బాబా వారికి చాదర్‌, గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముజావర్ల ఇళ్ల నుంచి బయలు దేరిన గంధం మహోత్సవం ఊరేగింపు అర్ధరాత్రి వరకు కొన సాగింది. అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మత పెద్దలు హాజరయ్యారు.

గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించండి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): గ్రామ, వార్డు సచివాలయాల్లోని సర్వేయర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ కోరారు. సమస్యల పరిష్కారానికి విజయవాడ ధర్నా చౌక్‌లో సర్వేయర్లు చేపట్టిన మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు శుక్ర వారంతో ముగిశాయి.

ఆయన మాట్లాడుతూ జీవో నంబరు 5లో మార్పులు చేసి.. అంతర్‌ జిల్లాల బదిలీలు చేపట్టాలని కోరారు. నిబంధనలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయన్నారు. బదిలీల ప్రక్రియలో సొంత మండలం నిబంధన సవరించాలని సూచించారు. దీక్షలో గ్రామ సర్వేయర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి నాగపడగ సమర్పణ1
1/2

సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి నాగపడగ సమర్పణ

సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి నాగపడగ సమర్పణ2
2/2

సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి నాగపడగ సమర్పణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement