
‘శాతవాహన’ భవనాలను పునర్నిర్మించాలి
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): శాతవాహన కళాశాల భవనాలను కూల్చివేసినవారే పునర్నిర్మించాలని శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ వి.సాంబిరెడ్డి డిమాండ్ చేశారు. కళాశాల గేటు వద్ద శుక్రవారం విలేకరుల సమావేశం జరిగింది. సాంబిరెడ్డి మాట్లాడుతూ 1971 నుంచి ఎంతోమంది విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులను తయారు చేసిన కళాశాల భవనాలను కోర్టు ఉత్తర్వులు ఉన్నాయనే పేరుతో బోయపాటి శ్రీనివాస అప్పారావు కుటుంబసభ్యులు కూల్చివేయడం సరికాదన్నారు. ఈ స్థలాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. సినిమా హీరోయిన్ హేమమాలినితో నగరంలో నృత్యప్రదర్శనను శాతవాహన కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసి టికెట్లు విక్రయించగా వచ్చిన నిధులను శ్రీదుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి అప్పగించారన్నారు. విద్యార్థులు ఇచ్చిన నగదుకు సొసైటీ వారు కొంత సొమ్మును జత చేసి బోయపాటి వారికి అందజేశారని సాంబిరెడ్డి వివరించారు. ఈ స్థల వివాదం ఏదైనా ఉంటే శాతవాహన కళాశాలకు ప్రభుత్వానికి మధ్యనే ఉంటుందని మీకు సంబంధం లేదని బోయపాటి శ్రీనివాస అప్పారావుకు ఆ సమయంలోనే ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని సాంబిరెడ్డి తెలియజేశారు.
● ఈ నెల 15వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు విశాలాంధ్ర పత్రిక కార్యాలయం ఆవరణలో శాతవాహన కళాశాలలో చదువుకున్న విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో గెట్ టు గెదర్ నిర్వహిస్తున్నామని సాంబిరెడ్డి చెప్పారు.
కమిటీ కో–కన్వీనర్ డి.విష్ణువర్దన్, పరిరక్షణ కమిటీ ప్రచార కమిటీ కన్వీనర్ ఎం.అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సేవ్ శాతవాహనా అంటూ కమిటీ సభ్యులు నినాదాలు చేశారు.
కళాశాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ సాంబిరెడ్డి