
తుది డీపీఆర్ను రూపొందించండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ– హైదరాబాద్ సెక్షన్లో జాతీయ రహదారి– 65ను ఆరు లైన్లుగా విస్తరించేందుకు తుది డీపీఆర్ను పక్కాగా రూపొందించాలని ఎంపీ కేశినేని శివనాథ్ అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలతో డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు. కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం ఎన్హెచ్ఎఐ, రెవెన్యూ, ఆర్అండ్బీ, నగరపాలక సంస్థ తదితర శాఖలతో ఐకాన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ఎన్హెచ్–65 రహదారి విస్తరణ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను భాగస్వామ్య పక్షాలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెన్హెచ్–65 రహదారిని 226 కిలోమీటర్ల మేర విస్తరించడం శుభపరిణామన్నారు. ఇది తెలంగాణలోని మందోళ్లగూడెం గ్రామం నుంచి ప్రారంభమై ప్రధానంగా చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ మీదుగా నందిగామ, కీసర, పరిటాల, మూలపాడు, ఇబ్రహీంపట్నం నుంచి గుంటు పల్లి విలేజ్ వరకు 266 కిలోమీటర్లను ఆరు లైన్ల రహదారిగా విస్తరించనున్నారన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి గొల్లపూడి వరకు హెవీ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని విస్తరణ ఉండాలన్నారు. నోవాటెల్ హోటల్ వద్ద సర్వీస్ రోడ్డుకు అలైన్మెంట్ పూర్తయిందని, అధికారులకు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శ్రీరాం తాతయ్య, వసంత కృష్ణప్రసాద్, తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.
జాతీయ రహదారి– 65 విస్తరణపై ఎంపీ కేశినేని శివనాథ్