
పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు
ఇబ్రహీంపట్నం: కాచవరం ఇందిరమ్మ కాలనీ రోడ్డులో ఈనెల 6న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నడకుదిటి ఏసుబాబు (28) హత్య జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ ఎ.చంద్రశేఖర్ నిందితులను ప్రవేశపెట్టి హత్య వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ మృతుడు కారు ప్రమాదంలో మృతి చెందినట్లు ముందుగా భావించినట్లు పేర్కొన్నారు. మృతుని బంధువులు తమకు సైకం ప్రభాకరరావు కుటుంబంతో వివాదాలు ఉన్నట్లు, వారే హత్య చేసి ఉంటారనే అనుమానంతో ఫిర్యాదు ఇచ్చారన్నారు. సమీపంలో సీసీ కెమేరాల పుటేజీ ఆధారంగా ఇది హత్యగా గుర్తించామన్నారు. సైకం ప్రభాకరరావుపై మృతుడు ఏసుబాబు గతంలో దాడిచేసి గాయపర్చినట్లు తెలిపారు. తండ్రిపై దాడి చేసిన కక్షను మనసులో పెట్టుకుని ప్రభాకరరావు కుమారులు సైకం కుమారస్వామి, నవీన్బాబు, మరోవ్యక్తి తిరుమలశెట్టి శంకర్తో కలిసి పథకం ప్రకారం కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని సీఐ స్పష్టం చేశారు. తిరుమలశెట్టి శంకర్ భార్య పేరుతో ఉన్న టీఎఫ్ 05–0875 కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సైకం కుమారస్వామి ఏ1, తిరుమలశెట్టి శంకర్ ఎ2, సైకం నవీన్బాబు ఏ3గా గుర్తించి కాచవరంలో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఎస్ఐ విజయలక్ష్మి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.