
భక్తులతో పోటెత్తిన కార్తికేయుని ఆలయం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం మంగళవారం భక్త సంద్రంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. స్వామివారి నిత్యకల్యాణంలో 73 జంటలు పాల్గొన్నాయి. ఈ ఒక్కరోజునే వివిధ సేవా టిక్కెట్ల ద్వారా రూ.9,07,678 ఆదాయంగా వచ్చిందని ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. పాఠశాలల వేసవి సెలవులు ముగియనుండటం, చతుర్థశితో కూడిన మంగళవారం కావడంతో వేలాదిగా భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించారు. ఆలయ అధికారులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.
బీచ్ ఫెస్టివల్ క్రీడా పోటీల విజేతలకు అభినందన
విజయవాడస్పోర్ట్స్: మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్టివల్లో నిర్వహించిన జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల ప్రదర్శన భేష్ అని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ పీఎస్ గిరీషా పేర్కొన్నారు. క్రీడల నిర్వహణలో శాప్ అధికారులు, డీఎస్డీఓలు, కోచ్లు, అసోసియేషన్ల బాధ్యుల కృషిని అభినందించారు. విజయవాడలోని శాప్ కార్యాలయ సమావేశపు హాలులో మంగళవారం బీచ్ ఫెస్టివల్ జాతీయ పోటీల్లో గెలుపొందిన ఏపీ క్రీడాకారులు, క్రీడా పోటీలు నిర్వహించిన శాప్ అధికారులు, సిబ్బంది, క్రీడా సంఘాల ప్రతినిధులను సత్కరించారు. తొలుత బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, కెనాయింగ్ అండ్ కయాకింగ్ జాతీయ పోటీల్లో ఏపీ తరఫున తలపడి పతకాలు సాధించిన విజేతలను సత్కరించి, ఆర్థిక ప్రోత్సాహకాలను అందజేశారు. శాప్ ఏఓ ఆర్.వెంకటరమణ నాయక్, టీఎస్ఓ ఎస్.వి.రమణ, ఎస్ఓలు కోటేశ్వరరావు, మహేష్, సురేంద్ర, కిషోర్, ఏడీ వేణు పాల్గొన్నారు.
మెడికల్ అకాడమీ తరలింపును విరమించాలి
కంకిపాడు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ సంస్థ ఐఐటీ మెడికల్ అకాడమీ తరలింపు యోచనను విరమించుకోవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈడుపుగల్లులోని ఐఐటీ–మెడికల్ అకాడమీ వద్ద మంగళవారం విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజేష్ మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ సంస్థ ఐఐటీ – మెడికల్ అకాడమీ 2017 నుంచి కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో బాలికలకు ప్రత్యేకంగా ఉన్న అకాడమీ ఇదొక్కటే అని గుర్తు చేశారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న అకాడమీని కేవలం అద్దె భారం సాకుతో మూతవేసి, విద్యార్థులను తరలించే ఆలోచన చేయటం దుర్మార్గమన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ షైనింగ్ స్టార్ అవార్డుల పేరుతో ప్రభుత్వ విద్యార్థుల కంటే ప్రైవేటు విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు. ఐఐటీ మెడికల్ అకాడమీని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
రేపటి నుంచి ఇగ్నో పరీక్షలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నిర్వహించే జూన్– 2025 టర్మ్ ఎండ్ పరీక్షలు ఈ నెల 12 నుంచి జూలై 19వ తేదీ వరకూ జరగనున్నాయని సంస్థ విజయవాడ ప్రాంతీయ కేంద్రం సీనియర్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ డి.ఆర్.శర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు అందరికీ హాల్ టికెట్లను ఇగ్నో వెబ్ సైట్లో అందుబాటులో ఉంచామని వివరించారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు తమ అధ్యయన కేంద్రాలను థియరీ పరీక్షల అనంతరం సంప్రదించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు విజయవాడ కొత్తపేట హిందూ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని స్వయంగా లేదా 0866–2565253 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించొచ్చని ఆ ప్రకటనలో సూచించారు.

భక్తులతో పోటెత్తిన కార్తికేయుని ఆలయం

భక్తులతో పోటెత్తిన కార్తికేయుని ఆలయం