ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టిన లారీ | - | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టిన లారీ

May 26 2025 1:29 AM | Updated on May 26 2025 1:29 AM

ట్రావ

ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టిన లారీ

కొడవలూరు: కొడవలూరు మండలం గండవరం సబ్‌స్టేషన్‌ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున ఆగి ఉన్న ట్రావెల్స్‌ బస్సును వెనుక నుంచి వచ్చిన కంటైనర్‌ లారీ ఢీకొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా విజయవాడకు చెందిన వారే. పోలీసులు తెలిపిన వివరాల మేరకు విజయవాడ నుంచి నాగూర్‌ నాగపట్నం వెళ్లేందుకు 40 మంది ప్రయాణికులు ట్రావెల్స్‌ బస్సులో శనివారం రాత్రి బయలుదేరారు. కొడవలూరు మండలం గండవరం సబ్‌స్టేషన్‌ వద్దకు ఆదివారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో చేరుకొన్నారు. ఇక్కడ ఖాళీ ప్రదేశం ఉండటంతో ప్రయాణికులు కాలకృత్యాలు తీర్చుకొనేందుకు బస్సును రోడ్డుకు పక్కగా నిలిపారు. ప్రయాణికుల్లో కొందరు ఖాళీ ప్రదేశాల్లో ఉండగా, విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన సిరింగి బాబురావు(50) బస్సు వెనుక నిల్చున్నారు. ఇంతలో చీమకుర్తి నుంచి చైన్నె పోర్టుకు వెళుతున్న కంటైనర్‌ లారీ ఆగి ఉన్న ట్రావెల్‌ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సు వెనుక నిల్చొని ఉన్న బాబురావు రెండు వాహనాల మధ్య నలిగి అక్కడికక్కడే మరణించగా, బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని 108లో చికిత్స నిమిత్తం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారిలో మృతుని కుమారుడైన కిరణ్‌కుమార్‌ పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై కోటిరెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన కొద్ది పేపటికే రూరల్‌ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కొడవలూరు సీఐ సురేంద్రబాబులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు సహాయ చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

● యాత్రకు చేరుకోక ముందే బాబురావు మృతి చెందడం, కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుని భార్య మున్నీ కన్నీటి పర్యంతమయ్యారు. మున్నీ రోదన బస్సులోని తోటి ప్రయాణికులను కలచి వేసింది.

క్షతగాత్రునికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పరామర్శ

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తీవ్ర గాయాలతో మెడికవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్‌కుమార్‌ను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వైద్యులతో మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్‌రెడ్డి ఎమ్మెల్సీ వెంట ఉన్నారు.

ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టిన లారీ 1
1/1

ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టిన లారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement