
ధ్వంసమైన కాజ్వేలపై పట్టింపేది?
జక్రాన్పల్లి : మండలంలోని పలు గ్రామాల్లో ధ్వంసమైన కాజ్వేలపై అధికారుల స్పందన కరువైంది. దీంతో గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జక్రాన్పల్లి మండలంలోని పడకల్ పెద్దమ్మ వాగుపై ఉన్న కాజ్వే, మనోహరాబాద్ వాగుపై ఉన్న కాజ్వేలు గతేడాది కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయాయి. దీంతో వాగుకు అటువైపు వ్యవసాయ పొలాలు ఉన్న రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల యాసంగి సమయంలో రెండు కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి వచ్చి పంటలను సాగు చేసుకున్నారు. కానీ పంటలకు అవసరమైన ఎరువులు చల్లుకోవడానికి మందులను తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులు జొన్న, మొక్కజొన్న పంటలు వేసుకున్నారు. ప్రస్తుతం కోత దశలో ఉన్న పంటల వద్దకు కోత కోయడానికి యంత్రాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురొంటున్నారు. గతేడాది పడకల్ పెద్ద చెరువు తెగిపోవడంతో కింది భాగంలో ఉన్న పడకల్ పెద్దమ్మ వాగుపై ఉన్న కాజ్వే, మనోహరాబాద్ వాగుపై ఉన్న కాజ్వేలు ధ్వంసమయ్యాయి. దీంతో రెండు గ్రామాల రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇదే వాగుపై దగ్గరలో కొత్తగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. దీంతో రైతుల పంట పొలాలకు వెళ్లడానికి రెండు కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి రావాల్సి వస్తోంది. దీంతో వ్యయ ప్రయాసలను ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి వాగుపై కాజ్వే నిర్మించాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.
ఇబ్బందుల్లో రైతులు, గ్రామస్తులు
పట్టించుకోని అధికారులు

ధ్వంసమైన కాజ్వేలపై పట్టింపేది?