బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
గౌహతి: రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని అమలు చేయాలని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత బిల్లును ఆమోదించింది. గిరిజనుల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలకు యూసీసీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. యూసీసీ బిల్లును ఈ నెల 26న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
తాజాగా అస్సాం సీఎంగా బాధ్యతలు చేపట్టిన హిమంత బిశ్వ శర్మ బుధవారం తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. యూసీసీ బిల్లుపై చర్చించి, ఆమోద ముద్ర వేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయబోతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు గుర్తుచేశారు. కానీ, తమ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా మార్పులుచేర్పులు చేసినట్లు వెల్లడించారు. గిరిజన జనాభాను యూసీసీ పరిధి నుంచి పూర్తిగా మినహాయించామని తెలిపారు.


