
సమయానికి బస్సులు నడిపించాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని పాఠశాలలో చదువుకోవడానికి వివిధ గ్రామాల నుండి విద్యార్థులు వస్తారని వారి సౌకర్యార్థం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా సమయాల్లో ఆర్టీసీ బస్సులను నడపాలని పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ కోరారు. ఈ మేరకు గురువారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఇన్చార్జ్కు వినతిపత్రాన్ని అందజేశారు. విద్యా సంస్థలన్నీ గురువారం నుంచి ప్రారంభ కావడంతో అన్ని గ్రామాలకు విద్యార్థులకు రవాణా సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా బస్సులను నడపాలన్నారు. గత సంవత్సరం పాఠశాల సమయానికి బస్సులు నడపకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యరన్నారు. చాలా మంది విద్యార్థులు పై చదువులు చదవడానికి జిల్లా కేంద్రానికి వస్తుంటారన్నారు. బస్సులు ఆలస్యంగా రావడం వల్ల వారు రోజు ఒకటి, రెండు క్లాస్లు నష్టపోయి విద్యా పరంగా వెనకబాటుకు గురయ్యే అవకాశం ఉందని, గతంలో జరిగిన పొరపాట్లు ఈ ఏడాది జరగకుండా పాఠశాల సమయానికి బస్సులు నడపాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు శ్వేత, అనిల్, రాము పాల్గొన్నారు.