
వేతనాలు వచ్చేదెన్నడో..?
కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఎదురుచూపులు
నారాయణపేట రూరల్: డీఎస్సీ–2008లో వారంతా అర్హత సాధించారు. పోస్టింగ్ రావడంలో ఆలస్యం కాగా.. 16 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిని కాంట్రాక్టు పద్ధతిలోనే విధుల్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి వేతనాలు అందుతాయని, భరోసా ఉంటుందని భావించారు. అప్పటి వరకు చేస్తున్న ఉద్యోగాలు మాని ఉపాధ్యాయులుగా విధుల్లో చేరారు. నాలుగు నెలలైనా వేతనాలు రాకపోవడంతో వారంతా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
జిల్లాలో 41 మంది..
జిల్లాలో డీఎస్సీ–2008లో 49 మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. ఐదుగురు ఇతర ఉద్యోగాల్లో స్థిరపడటంతో 44 మందికి ఆర్డర్ కాపీలు అందించారు. వారిలో మరో ముగ్గురు పాఠశాలల్లో రిపోర్ట్ చేయకపోగా.. 41 మంది ఈ ఏడాది ఫిబ్రవరి 15న విధుల్లో చేరి కేటాయించిన పాఠశాలల్లో పాఠాలు బోధిస్తున్నారు. కాని ఇప్పటి వరకు వారికి కనీసం ఎంప్లాయ్ ఐడీ ఇవ్వకపోగా.. నాలుగు నెలలుగా వేతనాలు సైతం పొందడం లేదు. రోజు పాఠశాలకు రవాణా చార్జీలు సైతం సొంతంగా పెట్టుకొని వెళ్లి వస్తున్నారు. విద్యా సంవత్సరం చివరలో ఆయా ఉపాధ్యాయులను టెర్మినేట్ చేసిన విద్యాశాఖ.. వేతనాల జారీలో మాత్రం జాప్యం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
నాలుగు నెలలుగా అందక ఇక్కట్లు
సర్వీసు పునరుద్ధరణపై నీలినీడలు

వేతనాలు వచ్చేదెన్నడో..?