
మద్దూరులో 4 గ్రామాలు విలీనం
మద్దూరు: స్థానిక పురపాలికలో మరో 4 గ్రామపంచాయతీలు విలీనమయ్యాయి. ఈ ఏడాది జనవరి 27న మద్దూరు, రెనివట్లను కలిపి పురపాలికగా మారుస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. గతంలో మద్దూరు గ్రామపంచాయతీ పరిధిలో భీంపూర్, నాగంపల్లి, సాపన్చెరువుతండా, అలాగే రెనివట్ల పరిధిలో ఎర్రగుంటతండా అనుబంధ గ్రామాలుగా ఉన్నాయి. తండాలు పంచాయతీలుగా ఏర్పాటుచేసే క్రమంలో అనుబంధ గ్రామాలు గ్రామపంచాయతీలుగా మారాయి. ఆయా గ్రామాలు మద్దూరు, రెనివట్ల పరిధిలో ఉండటంతో వాటిని తిరిగి పురపాలికలో విలీనం చేయాలని ఆదేశాలు రావడంతో గురువారం పుర కమిషనర్ శ్రీకాంత్ ఆయా పంచాయతీల్లో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి నుంచి ఈ నాలుగు పంచాయతీలు కూడా మద్దూరు పురపాలికలో చేరనున్నాయి.
నేడు భూ భారతిపై ఇన్చార్జి మంత్రి సమీక్ష
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు చెందిన భూభారతి రెవెన్యూ సదస్సులతో పాటు పలు అభివృద్ధి అంశాలపై శుక్రవారం స్థానిక కలెక్టరేట్ మీటింగ్హాల్ ఉదయం 11.30 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమీక్షకు జిల్లా ఇన్చార్జి మంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర నర్సింహ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం సేకరణ, వ్యవసాయం, వ్యాధులు అంశాలపై కూడా ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
1న మహిళా
క్రికెట్ జట్టు ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: త్వరలో జరిగే హెచ్సీఏ ఉమెన్ టోర్నీల్లో పాల్గొనే ఉమ్మడి మహిళా జట్టు ఎంపికలను ఆదివారం ఉదయం 10 గంటలకు జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారిణులు వైట్ డ్రెస్, ఆధార్కార్డు, ఫొటోతో ఎంపికలకు హాజరుకావాలని సూచించారు.