
డీఎంహెచ్ఓపై వేటు
నారాయణపేట రూరల్: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఆదివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘అవినీతికి అడ్డా!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆ శాఖ రాష్ట్ర అధికారులు స్పందించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా వైద్యాధికారి డా. సౌభాగ్యలక్ష్మిని హైదరాబాద్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆమె స్థానంలో డా. జయచంద్రమోహన్ను నియమిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. నోటిఫికేషన్లు లేకుండానే పోస్టింగులు ఇవ్వడం, కలెక్టర్ అనుమతి లేకుండానే చేపట్టిన పలు పనులపై పలువురు ఫిర్యాదులు సైతం చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. దీంతో ఆమెను విధుల నుంచి తప్పించి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్ఎంఓగా పనిచేస్తున్న డా. జయచంద్రమోహన్కు బాధ్యతలు అప్పగించారు. ఈయన గతంలో వనపర్తి డీఎంహెచ్ఓగా, వికారాబాద్ డిప్యూటీ డీఎంహెచ్ఓగా, హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి డిప్యూటీ ఆర్ఎంఓగా, జిల్లా ఏరియా ఆస్పత్రిలో అనస్తీషియా వైద్యుడిగా, డీఎంహెచ్ఓగా విధులు నిర్వర్తించారు.
జాబ్ మేళాను వినియోగించుకోవాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్స్లో మే 3న శనివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డా. కె.రాజ్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం జాబ్ మేళాకు సంబంధించిన వాల్పోస్టర్ను ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఫౌండేషన్ ఎనలేని కృషి చేస్తోందన్నారు. మేళాలో సుమారు 25 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, ఉదయం 9.30 నుంచి సాయత్రం 4 వరకు జాబ్ మేళా కొనసాగుతుందని.. జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, పోలీస్ పటేల్ మధుసూదన్రెడ్డి, సుదర్శన్రెడ్డి, గోపాల్గౌడ్, రుద్రారెడ్డి, హన్మంత్, సంతోష్, శివరాజ్, నరేష్గౌడ్, ప్రవీణ్, విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
● రాష్ట్ర వైద్య,
ఆరోగ్యశాఖ సీరియస్
● జిల్లా వైద్యాధికారిగా డా. జయచంద్రమోహన్ నియామకం

డీఎంహెచ్ఓపై వేటు