
నా జీవితంలో చీకటి రోజులు.. పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తుండేవి. ఆ ఆలోచనలు నన్ను నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నాను. నా మనసుకు నచ్చినట్లు రియాక్ట్ అయ్యా. ముందడుగు వేశా. అదృష్టం ఏంటంటే కుటుంబ సభ్యులు, మిత్రులు చాలామంది నాకు అండగా నిలబడ్డారు.
సమంత, నాగచైతన్య జీవితంలో ఏ మాయ చేసావె సినిమా సినిమా నిజంగానే మాయ చేసింది. ఇద్దరి కెరీర్ను మలుపు తిప్పిన ఈ సినిమాతోనే వారి ప్రేమ ప్రయాణం మొదలైంది. ఈ సినిమా వచ్చిన ఏడాదికే (2017లో) వీరిద్దరూ పెళ్లిపీటలెక్కారు. ఈ జంటను చూసి ముచ్చటపడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. పెళ్లి తర్వాత మజిలీ చిత్రంతో మరోసారి మెప్పించారిద్దరూ.
కానీ ఎవరి కన్ను కుట్టిందో ఏమో కానీ 2021 అక్టోబర్లో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో అభిమానుల మనసు ముక్కలైంది. ఎంతగానో అభిమానించిన జంట ఇక మీదట కలిసి ఉండబోదని తెలిసి తీవ్ర నిరాశకు లోనయ్యారు ఫ్యాన్స్. విడాకుల తర్వాత సమంత పుష్పలో ఊ అంటావా సాంగ్ చేయడంపై ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.
తాజాగా చైతో విడాకులు, తనపై జరిగిన ట్రోలింగ్పై స్పందించింది సామ్. 'అవి నా జీవితంలో చీకటి రోజులు.. పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తుండేవి. ఆ ఆలోచనలు నన్ను నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నాను. నా మనసుకు నచ్చినట్లు రియాక్ట్ అయ్యా. ముందడుగు వేశా. అదృష్టం ఏంటంటే కుటుంబ సభ్యులు, మిత్రులు చాలామంది నాకు అండగా నిలబడ్డారు.
కానీ ఇప్పటికీ ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోలేకపోతున్నా. కాకపోతే ముందుతో పోలిస్తే ఆ చీకటి రోజులు కొంత తగ్గాయి. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిలోనే మనం చిక్కుకుని ఉండిపోకూడదు' అని చెప్పుకొచ్చింది సామ్. కాగా సమంత ప్రస్తుతం ఖుషి సినిమాతో పాటు సిటాడెల్ వెబ్సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే! ఆమె నటించిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది.