
సినిమా రంగంలో అందించే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు తమ చిత్రం ఎంపికైందని కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ ట్వీట్ చేశారు. పాపా బుకా అనే చిత్రం అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 98వ అకాడమీ అవార్డులకు అఫీషియల్ ఎంట్రీగా ప్రకటించారని పోస్ట్ చేశారు. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఇండియా నుంచి భాగం కావడం మా నీల ప్రొడక్షన్స్కు లభించిన గౌరవమని సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ఈ మూవీ పుపువా న్యూ గినియా దేశం నుంచి అధికారిక ఎంట్రీని దక్కించుకుంది. దీంతో తొలిసారి ఆస్కార్ ఎంట్రీ ఘనతను ఆ దేశం సొంతం చేసుకుంది.
పా రంజిత్ తన ట్వీట్లో రాస్తూ.. 'అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 98వ అకాడమీ అవార్డులకు పాపా బుకా అధికారికంగా ఎంపికైంది. పపువా న్యూ గినియా దేశం ఎంట్రీగా ఎంపికైందని చెప్పడానికి గర్వంగా ఉంది. భారతదేశం నుంచి నిర్మాతలలో ఒకరిగా..రెండు దేశాల సహ-నిర్మాణంలో భాగం కావడం నీలం ప్రొడక్షన్స్కు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఈ ప్రయాణానికి మద్దతుగా, అలాగే ఈ కథను ప్రపంచ వేదికకు తీసుకెళ్లడంలో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికీ దక్కిన గౌరవమిది. ఈ సినిమా ద్వారా మరిన్ని ప్రశంసలు పొందడం రెండు దేశాలకు గర్వకారణం. ఈ ఘనత సాధించిన పాపా బుకా చిత్ర బృందానికి శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేశారు.
కాగా.. ఈ సినిమాకు డాక్టర్ బిజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పపువా న్యూగినియాకు చెందిన నోయెలీన్ తౌలా వునమ్, ఇండియాకు చెందిన అక్షయ్ కుమార్ పరిజా, పా రంజిత్, ప్రకాష్ బేర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19, 2025న పపువా న్యూ గినియా దేశంలోని థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ప్రదర్శనలు, అకాడమీ అవార్డుల కోసం లాస్ ఏంజిల్స్లో ప్రదర్శించనున్నారు. డైరెక్టర్ బిజు ఇప్పటికే సైరా, వీట్టిలెక్కుల్ల వాజి, పెరారియథావర్, వేయిల్మరంగల్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మూడుసార్లు జాతీయ అవార్డు గ్రహీత, ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించాయి.
It is a proud moment for me to state that Papa Buka has been officially selected as Papua New Guinea’s entry for the 98th Academy Awards in the International Feature Film category. As one of the producer from India, it has been an honour for Neelam Productions to be part of this… pic.twitter.com/3aEkSFP1DM
— pa.ranjith (@beemji) August 27, 2025