
‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025’(సైమా) లో ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా సత్తా చాటింది. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సందీప్ సరోజ్ కి సైమా అవార్డు వచ్చింది. నిర్మాతగా తొలి ఫీచర్ ఫిల్మ్తోనే నిహారిక టాలీవుడ్లో ఓ హిస్టరీని క్రియేట్ చేసినట్టు అయింది. ఈ మూవీకి యదు వంశీ డైరెక్టర్గా, ఎదురురోలు రాజు సినిమాటోగ్రఫర్గా, అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్గా పని చేశారు.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం గతేడాది ఆగస్ట్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. రూ.9 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 24.5 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా, దర్శకుడు యధు వంశీకి ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డులు సాధించిన సంగతి తెలిసిందే. రీసెంట్గా గామా అవార్డుల్లోనూ ‘కమిటీ కుర్రోళ్లు’ సత్తా చాటింది. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా యదు వంశీకి గామా అవార్డులు వచ్చాయి.