
నిర్వహణ మరింత మెరుగుపడాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ మరింత మెరుగు పడాలని, ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకూడదని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీల ప్రత్యేక అధికారులు, వార్డెన్లకు 2025–26 విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన అంశాలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి హాస్టల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ప్రతి విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్, ఉపాధ్యాయులు, కుక్, కమిటీలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. హాస్టళ్లను ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీ చేస్తామని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీలను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు. పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేయించాలని కోరారు.
మెదక్లో కలెక్టర్ పర్యటన
మెదక్ మున్సిపాలిటీ: కలెక్టర్ రాహుల్రాజ్ మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా పట్టణంలోని గాంధీనగర్ ఏరియాలో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను పరిశీలించారు. మ్యాప్ను పరిశీలిస్తూ పంచాయతీరాజ్ డీఈ పాండురంగారావు, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావులను పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు, నిర్దేశిత గడువు తేదీలోగా నిర్మాణం పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్ను పరిశీలించారు.
సంక్షేమ హాస్టళ్లలో మెనూ తప్పనిసరి
కలెక్టర్ రాహుల్రాజ్