ఉట్నూర్రూరల్: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఐటీడీఏ పీవో మంద మకరందు పేర్కొన్నారు. కుమురం భీం ప్రాంగణ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల సర్మేడి నాయకులతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, గిరిజన హక్కులు, వెదురు ఆధారిత పరిశ్రమలు, పల్లిపట్టీ, మహువా లడ్డూల తయారీ, చేపల పెంపకం, గోండి భాష అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోండి భాషను కంప్యూటర్లో సులభంగా అర్థమయ్యేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను తెలిసేలా పర్యాటక రంగ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తమ ప్రాంతాల్లోని సమస్యలను సర్మేడి నాయకులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులకు దీపావళికి ప్రత్యేక సెలవులు ఇవ్వాలని కోరారు. కొందరు చదువుకోకుండా క్రికెట్ ఆడుతున్నారని దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే స్పందిస్తూ పోలీసు యంత్రాంగం, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం మండల కేంద్రంలో సుమారు రూ.కోటి వ్యయంతో గ్రంథాలయాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో సర్మేడి ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


