జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో జర్నలిస్టులు క్రియాశీలక పాత్ర పోషించాలని డీపీఆర్ఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. 12ఏళ్ల విశ్వాసం, వికాసం, ప్రజాసంక్షేమం పేరిట దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) హైదరాబాద్ విభాగం శుక్రవారం స్థానిక ఓ కన్వెంషన్ హాల్లో ప్రత్యేక వార్తాలాప్ మీడియా వర్కుషాపు నిర్వహించారు. జ్యోతిప్రజ్వల చేసిన డీపీఆర్ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కృత్రిమ మేధ, డిజిటల్ సమాచార యుగంలో వాస్తవ నిర్ధారణ, బాధ్యతాయుతమైన పాత్రికేయానికి ఉన్న ప్రాధాన్యం గురించి వివరించారు. పీఐబీ హైదరాబాద్ విభాగం మీడియా, కమ్యూనికేషన్ అధికారి గాయత్రి వార్తాలాప్ కార్యక్రమ విశిష్టత గురించి వివరించారు. అలాగే డిజిటల్ యుగంలో ఫ్యాక్ట్–చెకింగ్, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడంపై ఫ్యాక్ట్ చెక్ శిక్షకురాలు బీఎన్ సత్యప్రియ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్చారి, పాత్రికేయులు పాల్గొన్నారు.


