
థ్యాంక్యూ పోలీస్!
కర్నూలు: ప్రయాణాలు, జనరద్దీలో పొరపాటున జారిపోవడం, దొంగలు అపహరించడం వంటి సంఘటనల్లో పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేయడంలో జిల్లా పోలీసులు సత్తా చాటుతున్నారు. లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ అప్లికేషన్ ద్వారా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోయిన సెల్ఫోన్ ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో ఎక్కడున్నా పట్టేస్తున్నారు. గత నాలుగేళ్లలో రూ.20 కోట్ల విలువ చేసే లక్షకు పైగా సెల్ఫోన్లు రికవరీ చేయగా విక్రాంత్ పాటిల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో విడత రూ.1.30 కోట్ల విలువ చేసే 604 సెల్ఫోన్లు రికవరీ చేశారు. గురువారం బాధితులను జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా చేతుల మీదుగా అందజేశారు. ఫోన్ పోగొట్టుకున్న వారిలో పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, మహిళలు, ఇతర వర్గాల వారు ఉన్నారు. తక్కువ వ్యవధిలో మూడు, నాలుగేళ్ల క్రితం పోగొట్టుకుని ఆశ వదులుకున్న వారి చేతికి మొబైల్ రికవరీ మేళాలో ఫోన్ అందడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎస్పీతో పాటు జిల్లా పోలీసులు, సైబర్ ల్యాబ్ సిబ్బందికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క రోజే 54 సెల్ఫోన్లను రికవరీ చేసిన కర్నూలు సబ్ డివిజన్ హెడ్ కానిస్టేబుల్ శేఖర్ బాబును అడిషనల్ ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీనివాసాచారి, సీఐలు నాగరాజ రావు, రామయ్య నాయుడు, సైబర్ ల్యాబ్ సీఐ వేణుగోపాల్, టెక్నికల్ టీమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే ఫిర్యాదు చేయండి..
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నవారు వెంటనే కర్నూలు పోలీస్ వెబ్సైట్కు http:// kurnoolpolice.in/mobiletheft ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా తెలిపారు. పోగొట్టుకున్న మొబైల్ ఐఎంఈ వివరాలతో పాటు ప్రస్తుతం వాడుతున్న సెల్ఫోన్ నెంబర్, వివరాలు పొందుపరచాలి. పోలీసు సేవలకు ఎలాంటి రుసుం ఉండదని అడిషనల్ ఎస్పీ తెలిపారు.
పోగొట్టుకున్న ఫోన్లు బాధితులకు
అందజేత
రూ.1.30 కోట్ల్ల విలువైన
604 సెల్ఫోన్లు రికవరీ
ఆనందం వ్యక్తం చేసిన బాధితులు