
కుక్కల దాడిలో 26 గొర్రె పిల్లలు మృతి
పెద్దకడబూరు: చిన్నకడబూరులో గురువారం సాయంత్రం కుక్కల దాడిలో 26 గొర్రె పిల్లలు మృతి చెందాయి. బాధితుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నాగయ్యగారి ఈరన్న, దొడ్డి తిమ్మారెడ్డి, పశువుల తిక్కయ్య జీవాల పెంపకం చేపట్టారు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి దొడ్డిలో నిలుపుకున్న వారు గురువారం ఉదయం పిల్లలను దొడ్డిలో ఉంచి మందను మేతకు తీసుకెళ్లారు. కాపలా ఉన్న ఇద్దరు కంచెను అడ్డువేసి ఇంటికి వెళ్లిపోయారు. సాయంత్రం 3గంటల సమయంలో అటుగా వచ్చిన నాలుగు కుక్కలు దొడ్డిలోకి దూకి గొర్రె పిల్లలపై దాడికి తెగబడ్డాయి. దాదాపు 55 పిల్లలకు పైగా ఉన్న గొర్రె పిల్లల మందపై దాడి చేయగా వాటిలో నాగయ్యగారి ఈరన్నకు చెందిన 14, దొడ్డి తిమ్మారెడ్డికి చెందిన 6, పశువుల తిక్కయ్యకు చెందిన 6 గొర్రెపిల్లలు మొత్తం 26 అక్కడికక్కడే మృతి చెందాయి. సాయంత్రం దొడ్డి దగ్గరకి వెళ్లిన బాధితులు మృతి చెందిన గొర్రె పిల్లలను చూసి నిర్ఘాంతపోయారు. స్థానికుల సహాయంతో దాడి చేసిన రెండు కుక్కలను చంపేశారు. కుక్కల దాడిలో తమకు రూ. 1.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.