నేడు యువజన, విద్యార్థి విభాగాల నిరసన కార్యక్రమం వాయిదా | - | Sakshi
Sakshi News home page

నేడు యువజన, విద్యార్థి విభాగాల నిరసన కార్యక్రమం వాయిదా

Jun 13 2025 7:09 AM | Updated on Jun 13 2025 1:41 PM

కర్నూలు(టౌన్‌): అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో ఈనెల 13న శుక్రవారం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో నిర్వహించతలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. 

కాగా విమాన ప్రమాద ఘటన బాధాకరమైందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఘటనలో వైద్య విద్యార్థులు చనిపోవడం మరింత కలచి వేసిందన్నారు. ఇలాంటి విషాద ఘటన సమయంలో నిరసనలు, ర్యాలీలు చేయడం మంచిది కాదని భావించి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులు గమనించాలని ఆయన పేర్కొన్నారు.

మైనారిటీ విద్యార్థులకు హాస్టళ్లలో ప్రవేశాలు

కర్నూలు(అర్బన్‌): 2025–26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని దూర ప్రాంతాలకు చెందిన మైనారిటీ విద్యార్థులు(బాలురు, బాలికలు) నగరంలోని హాస్టళ్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి ఎస్‌.సబీహా పర్వీన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులకు ప్రత్యేకంగా వసతి గృహాలు ఉన్నాయని, నగరంలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోస్టుమెట్రిక్‌ వసతి గృహం ఉందన్నారు. అర్హులైన విద్యార్థులు 94408 22219ను సంప్రదించాలన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు చదువు తున్న బాలికల ప్రీమెట్రిక్‌ వసతి గృహంలో అర్హులైన వారు 90302 62833జీ సంప్రదించాలన్నారు.

కుక్కల దాడిలో జింక మృతి...

కోడుమూరు రూరల్‌: కోడుమూరు – కర్నూలు రహదారి పక్కన పొలాల్లో గురువారం ఉదయం సంచరిస్తున్న జింకపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయి. మృతిచెందిన జింకను చూసిన స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారమిచ్చారు. బీట్‌ ఆఫీసర్‌ రేణుక సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పశువైద్యాధికారి చేత జింక కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం దహనం చేశారు.

విద్యార్థి అదృశ్యం

ఆలూరు రూరల్‌: పెద్దహోతూరు గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి రెండు రోజులుగా కనిపించడం లేదు. ఎస్‌ఐ మహబూబ్‌ బాషా తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మహానంది, లీలావతి దంపతుల కుమారుడు సుభాష్‌ చంద్రబోస్‌ ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు క్రికెట్‌ ఆడుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వారి బంధువుల ఇళ్లలో విచారించారు. చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ఆచూకి లభ్యం కాలేకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహబూబ్‌ బాషా తెలిపారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 9121101158కు సమాచారం ఇవ్వాలన్నారు.

నీటి కోసం వెళ్తుండగా..

పాణ్యం: నీటి కోసం వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. సుగాలిమెట్టలో విద్యుత్‌ అంతరాయంతో నీటి సమస్య ఏర్పడుతోంది. బాలునాయక్‌ అనే వ్యక్తి నీటి కోసం బైక్‌పై పాణ్యం వస్తుండగా ఎస్సార్బీసీ కాల్వపై వద్ద వెనుక వస్తున్న ఓ కారు ఢీకొనడంతో గాయాలపాలయ్యాడు. హైవే పోలీసులు క్షతగాత్రుడిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement