నడవలేని ‘తల్లీబిడ్డ’ | - | Sakshi
Sakshi News home page

నడవలేని ‘తల్లీబిడ్డ’

Jun 1 2025 1:11 AM | Updated on Jun 1 2025 1:11 AM

నడవలే

నడవలేని ‘తల్లీబిడ్డ’

మూలకు చేరిన వాహనాలు

బాలింతలకు తప్పని తిప్పలు

ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేట్‌ వాహనాల్లో ఇంటికి

వాహనాల డ్రైవర్లకు అందని జీతాలు

స్పందించని రాష్ట్ర ప్రభుత్వం

కర్నూలు(హాస్పిటల్‌): ఉమ్మడి జిల్లాలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాల, డోన్‌, ఎమ్మిగనూరు, ఆదోని, ఆత్మకూరు, బనగానపల్లె ఏరియా ఆసుపత్రులు, 18 సీహెచ్‌సీలు 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 40 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం అర్భన్‌ హెల్త్‌ సెంటర్లు, కొన్ని పీహెచ్‌సీలు మినహా మిగిలిన వాటిలో ప్రసవాలు జరుగుతున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో ప్రసవించిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో ఇంటికి పంపించేందుకు గాను గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జీవీకే అనే ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. ఈ మేరకు ఆ సంస్థ అప్పట్లో జిల్లాలో 28 వాహనాలను ఏర్పాటు చేసింది. ఆయా ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలను డిశ్చార్జ్‌ అనంతరం వారి ఇళ్లకు వాహనాల ద్వారా చేర్చేవారు. ఈ వాహనాలకు అప్పట్లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ అని పేరు పెట్టారు.

నిర్వహణ అస్తవ్యస్తం

ఉమ్మడి జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాల, ఆదోని ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆయా ఆసుపత్రుల వద్ద తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహన డ్రైవర్లు మాత్రం ఒక్కో వాహనంలో నలుగురికి మించి వస్తేనే అప్పట్లో తీసుకెళ్లేవారు. ఇదే సమయంలో ఒకే రూటులో ఉన్న బాలింతలు పోగయ్యేంత వరకు వేచి ఉండేవారు. మధ్యాహ్నం 1 గంటకు డిశ్చార్జ్‌ అయినా కొన్ని సార్లు రెండు, మూడు గంటలు వేచి ఉండాల్సి వచ్చేది. ఇలా వేచి ఉండలేని వారు సొంతంగా ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేవారు. అప్పట్లో వాహనాల నిర్వహణ కూడా సరిగ్గా ఉండేది కాదు. మరమ్మతులు చేయకపోవడంతో వాహనాలు మూలకుపడేవి.

మళ్లీ పాత రోజులు..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొదుపు చర్యల పేరుతో వాహనాల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న 64 వాహనాల్లో 8 వాహనాలు మూలకు చేరాయి. వాహనాలకు పెట్రోల్‌ వేయించడంలోనూ రేషన్‌ విధించారు. గతంలో నెలకు ఒక్కో వాహనానికి నెలకు రూ.40వేలు పెట్రోల్‌కు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.8వేలకు తగ్గించారు. డ్రైవర్లకు ఒక సిమ్‌ ఇచ్చారు. అందులో రూ.10వేలు మొత్తం ఉంటుంది. అయినా సరే రూ.4వేలు మాత్రమే పెట్రోల్‌ వేయించుకోవాలి. అది అయిపోయాక అనుమతి తీసుకుని మళ్లీ వేయించుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఒకసారి ఫుల్‌ ట్యాంకు పెట్రోల్‌ వేయిస్తే దూరాన్ని బట్టి కొన్నిసార్లు రెండు రోజులు మాత్రమే వస్తుంది. ఈ మేరకు వాహనానికి ఇచ్చిన రేషన్‌ వారం, పది రోజులకే అయిపోతోందని వాహన డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నామమాత్రంగా బాలింతల తరలింపు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాలింతలను తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ద్వారా నామమాత్రంగా తరలిస్తున్నారు. వాహన డ్రైవర్లకు డ్యూటీ సమయం 8 గంటలు. ఈ మేరకు వారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంది. అలాగని సాయంత్రం 4 గంటలకు బాలింతలను వాహనాల్లో ఎక్కించుకున్నా తిరిగి వచ్చేసరికి కొన్నిసార్లు రాత్రి 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. ఈ మేరకు కొన్ని చోట్ల డ్రైవర్లు సాయంత్రం 4 గంటల్లోపు డిశ్చార్జ్‌ అయిన వారిని మాత్రమే తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత డిశ్చార్జ్‌ అయితే తీసుకెళ్లడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

అందని జీతాలు

వైఎస్సార్‌సీపీ హయాంలో దర్జాగా

2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల సంఖ్యను 28 నుంచి 64కు పెంచింది. ఒకప్పుడు ముగ్గురు, నలుగురు బాలింతలను ఒకేసారి తీసుకెళ్లే పరిస్థితి నుంచి ఒక్కరు ఉన్నా తీసుకెళ్లే పరిస్థితికి చేరింది. పది కిలోమీటర్లైనా, వంద కిలోమీటర్లైనా సరే బాలింతలు అప్పట్లో దర్జాగా ఈ వాహనంలో వెళ్లేవారు. ఈ మేరకు ప్రతి నెలా 2వేల మంది దాకా బాలింతలను ఆయా వాహనాల్లో తీసుకెళ్లేవారు.

రెండో కాన్పు కష్టం కావడంతో చాగలమర్రికి చెందిన విశాలను నంద్యాల నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు గత నెలలో రెఫర్‌ చేశారు. సిజేరియన్‌ కాన్పు అనంతరం వారం రోజులు ఆసుపత్రిలో ఉన్న తర్వాత వైద్యులు ఆమెను డిశ్చార్జ్‌ చేశారు. అయితే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం పెట్రోల్‌ సరిపోదని చెప్పడంతో ఆమె అందులో వెళ్లలేకపోయారు.

కౌతాళానికి చెందిన బజారమ్మ తన మొదటి కాన్పు కోసం ఆదోనికి వెళ్లగా ఆమెకు గుండెలో సమస్య కూడా ఉండటంతో కర్నూలుకు రెఫర్‌ చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఆమెను నెలరోజులు ముందుగా చేర్చుకుని అన్నీ సక్రమంగా అయ్యాక సిజేరియన్‌ ద్వారా ప్రసవం చేశారు. అయితే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం రాకపోవడంతో ఆమె ఆర్టీసీ బస్సులో కౌతాళం వెళ్లారు.

ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే ఇద్దరు, ముగ్గురు జమ అయితేనే ఒకేసారి వాహనంలో తీసుకెళ్లేవారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు వాహనాల సంఖ్యను రెట్టింపు చేశారు. ప్రసవాలు జరిగే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ వాహనాలు అందుబాటులో ఉంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. పెట్రోల్‌ కొరత కారణంగా ఏ వాహనం ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనానికి ఒకరు చొప్పున 64 మంది డ్రైవర్లు ఉండాలి. ఏడాది కాలంగా ఈ వాహన డ్రైవర్లకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారు. గత మార్చి నుంచి ఇప్పటి వరకు జీతాలు చెల్లించలేదు. ఈ పరిస్థితుల్లో ఎనిమిది మంది డ్రైవర్లు ఉద్యోగం మానుకున్నట్లు సమాచారం. దీనికితోడు ఏ రోజూ వారు విధులకు సెలవు పెట్టేందుకు అవకాశం ఉండటం లేదు. తప్పనిసరిగా డ్యూటీకి రావాల్సిన పరిస్థితి నెలకొనడం, జీతం కూడా నెలకు మినహాయింపులు పోను రూ.7,870లు మాత్రమే వస్తుండటంతో ఉద్యోగాలు మానుకుంటున్నారు. ఈ కారణంగా జిల్లాలోని మారుమూల ప్రాంతాల మండలాల్లో డ్రైవర్‌ పోస్టులు ఖాళీగా మారాయి.

ఉద్యోగ భద్రత లేదు

లేబర్‌ యాక్ట్‌ ప్రకారం కనీస వేతనం మాకు రోజుకు రూ.700 ఇవ్వాలి. ప్రస్తుతం మినహాయింపులు పోను రూ.7,870 మాత్రమే ఇస్తున్నారు. అవి కూడా నాలుగు నెలలకు ఒకసారి చొప్పున ఇస్తున్నారు. దీనికితోడు ఉద్యోగ భద్రత లేదు. మా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. మే 20న నల్లబ్యాడ్జీలు ధరించి సమ్మె చేశాం.

–కె.రంగస్వామి, ఏపీ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు

నడవలేని ‘తల్లీబిడ్డ’ 1
1/2

నడవలేని ‘తల్లీబిడ్డ’

నడవలేని ‘తల్లీబిడ్డ’ 2
2/2

నడవలేని ‘తల్లీబిడ్డ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement