
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు, మూడేళ్ల క్రితం కావేరి–జా
బీటీ పత్తి విత్తనాలకు
సొంత ధ్రువీకరణ
● కంపెనీల తీరుపై వ్యవసాయ శాఖ
మీనమేషాలు
● కో–మార్కెటింగ్ పేరిట
బీటీ పత్తి విత్తన వ్యాపారం
● సిస్టర్ కన్సల్టెన్సీ,
సబ్ డీలర్ల పేరుతో దందా
● తరచూ విత్తనం కారణంగా
దెబ్బతింటున్న పంట
● గతంలో నిండా ముంచిన
‘కావేరి–జాదు’
● బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్లు
బ్లాక్ విక్రయాలు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రం మొత్తం మీద పత్తి 5,28,361 హెక్టార్లలో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే దాదాపు 50 శాతం వరకు సాగవుతోంది. కర్నూలు జిల్లాలో 2,34,409 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 18,827 హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటం వల్ల దశాబ్దాలుగా పత్తి రైతుల పాలిట తెల్ల బంగారం అవుతోంది. ఇక్కడ హైబ్రిడ్ పత్తి, బీటీ పత్తి విత్తనోత్పత్తి కూడా ఎక్కువగా ఉంటోంది. విత్తన కంపెనీల దృష్టి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాపైనే ఉండటం గమానార్హం. రాష్ట్రం మొత్తం మీద జరిగే మార్కెటింగ్ ఒక ఎత్తు అయితే, ఇక్కడి మార్కెటింగ్ మరో ఎత్తు. జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో పత్తి సాగుకు విత్తనాలు సిద్ధం చేసుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ కో–మార్కెటింగ్, సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్.. ఇలా రకరకాల పేర్లతో పత్తి విత్తన ప్యాకెట్లను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏది ఒరిజినల్, ఏది నకిలీ తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారింది. వాస్తవానికి కో–మార్కెటింగ్ అనేది లేదు. కానీ అనధికారికంగా సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ పేర్లతో రైతులను దగా చేస్తున్నా వ్యవసాయ శాఖ చేష్టలుడిగి చూస్తోంది. జిల్లాలో 250 కంపెనీలు దాదాపు 1000 దాకా బీటీ పత్తి విత్తన రకాలను మార్కెట్లోకి విడుదల చేయడం గమనార్హం.
పంట దెబ్బతింటే దేవుడే దిక్కు!
పత్తి విత్తన నాణ్యతపై వ్యవసాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కంపెనీలే సొంతంగా ధ్రువీకరించుకుంటున్నాయి. ఈ కారణంగా పంట దెబ్బతింటే ఆయా కంపెనీలదే పూర్తి బాధ్యత. అయితే పంట దెబ్బతిన్న సమయంలో వాతావరణ పరిస్థితులను కారణంగా చూపుతూ కంపెనీలు చేతులు దులుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పంట దెబ్బతిన్నప్పుడు పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 ఖరీఫ్ సీజన్లో కూడా ఒక పేరొందిన కంపెనీ విత్తనంతో సాగు చేసిన పత్తి పలు చోట్ల దెబ్బతినింది. అయితే ఆ కంపెనీ వ్యవసాయ యంత్రాంగాన్ని ముడుపులతో లోబరుచుకొని ఇతర కారణాలతో పంట దెబ్బతిన్నట్లు రిపోర్టు ఇవ్వడం గమనార్హం.
బ్లాక్లో పత్తి విత్తనాలు
ఈ సారి పత్తి సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వర్షాలు పడుతున్నందున ఈ నెల చివరి వారం నుంచే పత్తి విత్తనాలు నాటుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వందల కంపెనీలు, రకాలు మార్కెట్ను ముంచెత్తుతున్నా.. వీటికి అనుమతులు ఉన్నాయా, లేదా అని వ్యవసాయశాఖ పటించుకున్న పాపాన పోవడంలేదు. ప్రధానంగా రెండు కంపెనీల బీటీ పత్తి విత్తన ప్యాకెట్లను బ్లాక్లో అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లాలోకి ఒకవైపు తెలంగాణ నుంచి, మరోవైపు కర్ణాటక నుంచి అనధికార పత్తి విత్తన ప్యాకెట్లు జిల్లాలోకి వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ ప్రాంతంలో పత్తి లూజు విత్తనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో నకిలీలు, అనుమతి లేని విత్తనాలను జోరుగా అమ్మకాలు సాగిస్తున్నా వ్యవసాయ శాఖ నుంచి స్పందన కరువైంది.
హెచ్టీ పత్తి సాగు ప్రమాదకరం
పత్తిలో హెచ్టీ విత్తనాలకు కేంద్రం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. పత్తిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. హెచ్టీ పత్తిలో కలుపు నివారణకు గ్లైపోసేట్ మందును పిచికారి చేస్తే కలుపు నాశనం అవుతుంది తప్ప.. పత్తి పంటకు ఏమీ కాదు. హెర్బిసైడ్ టాలరెంట్(హెచ్టీ) బీటీ పత్తి విత్తనాలు జీవవైవిధ్యానికి ప్రమాదకరమనే ఉద్దేశంతో కేంద్రం వీటికి అనుమతివ్వలేదు. అయినప్పటికీ కొంతమంది రైతులు హెచ్టీ పత్తి సాగు చేస్తున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ప్రత్యేక టీమ్ వచ్చి హెచ్టీ పత్తి విత్తనాలను గుర్తించేందుకు తనిఖీలు జరిపి పరీక్షలు నిర్వహించారు. అయితే తూతూమంత్రంగా పరీక్షలు నిర్వహించారనే చర్చ జరుగుతోంది.
బీటీ టెక్నాలజీని మ్యాన్శ్యాంటో కంపెనీ తెచ్చింది. బీటీ టెక్నాలజీని పొంది విత్తనోత్పత్తి, ప్యాకింగ్, మార్కెటింగ్ చేసుకోవాలంటే మ్యాన్శ్యాంటో నుంచి లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఈ కంపెనీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో 45 కంపెనీలకు లైసన్లు ఉండగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకే ఒక్క కంపెనీకి మాత్రమే లైసన్స్ ఉంది.
కో–మార్కెటింగ్ పేరుతో ఉమ్మడి జిల్లాలో 10 వరకు కంపెనీలు ఉండగా.. సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ పేరుతో వందలాది కంపెనీల బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల మార్కెటింగ్లో నిమగ్నమయ్యాయి.
450 గ్రాముల బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్ ఎంఆర్పీ రూ.901. నూజివీడు కంపెనీ రేవంత్ రకం ప్యాకెట్లను రూ.1,300 పైబడిన ధరతో అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
యుఎస్ అగ్రీ కంపెనీకి చెందిన 7067 రకాన్ని రూ.1,200 వరకు బ్లాక్లో అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం.