
శ్రీమఠంలో భక్తజన సందోహం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం భక్తజన సందోహంతో కనువిందు చేసింది. గురువారం ప్రత్యేకం కావడంతో భక్తులు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. రాఘవేంద్రస్వామి బృందావన దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. సాధారణ క్యూలైన్లు, వీవీఐపీ క్యూలైన్లు, మంచాలమ్మ దర్శన మార్గాలు భక్తలతో కిక్కిరిశాయి. అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లలో రద్దీ నెలకొంది. మధ్వమార్గం కారిడార్, తుంగభద్ర నది వైపు కారిడార్లు భక్తులతో పోటెత్తాయి.
పదవీ కాలం పొడిగింపు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు అఫీషియల్ పర్సన్ ఇన్చార్జీల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి పీఏసీఎస్కు సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ పి.లక్ష్మీకాంతరెడ్డి, కల్లూరు పీఏసీఎస్కు అసిస్టెంటు రిజిస్ట్రార్ టి.నాగరమణయ్య, నంద్యాల జిల్లాలోని హనుమంతుగుండం పీఏసీఎస్కు అసిస్టెంటు రిజిస్ట్రార్ జి.రాచయ్య అఫీషియ ల్ పర్సన్ ఇన్చార్జీలుగా కొనసాగుతున్నారు. వీరి పదవీ కాలం ఏప్రిల్ 30తో ముగిసిన నేపథ్యంలో ఆరు నెలల పాటు పొడిగిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబరు 229 జారీ అయ్యింది. ఈ ఏడాది అక్టోబరు 30 వరకు అఫీషియల్ పర్సన్ ఇన్చార్జీలుగా కొనసాగుతారు.
కార్మిక చట్టాలపై అవగాహన
కర్నూలు కల్చరల్: మేడే సందర్భంగా కర్నూలులోని న్యాయ సేవా సదన్లో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్మిక చట్టాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ అవగాహన కల్పించారు. ఈ–శ్రమ్ కార్డును పొందాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సాంబశివరావు సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు శ్రీలక్ష్మీ, కేశన్న, ప్రసాద్, దుకాణ కార్మికులు, ఆటో, హమాలీ, బిల్డింగ్ కార్మికులు పాల్గొన్నారు.
అస్తవ్యస్తంగా పింఛన్ల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఉదయం 10 గంటల దాటినా ఉద్యోగులు ఇంటి వద్దకు రాకపోవడంతో మండటెండల్లో గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. కల్లూరులో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయలేదు. కోడుమూరు, సి.బెళగల్, కర్నూలు, ఆదోని, డోన్, బనగానపల్లి, అవుకు తదితర ప్రాంతాల్లో నామమాత్రంగా చేశారు. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి కర్నూలు జిల్లాలో 2,37,828 పింఛన్లు ఉండగా 2,20,796 (92.84 శాతం), నంద్యాల జిల్లాలో 2,14,058 పింఛన్లు ఉండగా 1,97,669 (92.34 శాతం) పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీలో కర్నూలు జిల్లాకు రాష్ట్రంలో 15, నంద్యాల జిల్లాకు 22వ స్థానం లభించింది.

శ్రీమఠంలో భక్తజన సందోహం