
ఆలంకొండ ఎత్తిపోతల పథకం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ సృజన
డోన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 19వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పర్యటనకు గడువు రెండు రోజులే ఉండటంతో పనులు శరవేగంగా చేస్తున్నారు. హంద్రీనీవా నీటిని ఉమ్మడి జిల్లాలో 77 చెరువులకు మళ్లించేందుకు నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం జగన్ వస్తున్నారు. కృష్ణగిరి మండలం ఆలంకొండ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం, డోన్ పట్టణంలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సృజన, డాక్టర్ మనజీర్ జిలానీ, ఎస్పీలు శ్రీకాంత్, రఘువీర్రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సభాస్థలిని పరిశీలించిన మంత్రి బుగ్గన..
డోన్ పట్టణ శివారులోని వెంకటనాయినిపల్లె సమీపంలో నిర్వహిస్తున్న బహిరంగ సభా స్థలాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆదివారం పరిశీలించారు. మంత్రి వెంట నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీశామూన్, ఎస్పీ రఘువీర్రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్రెడ్డి, ఆర్డీఓ వెంకటరెడ్డితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఉన్నారు. సభా వేదిక, ప్రేక్షకుల గ్యాలరీ, వీఐపీల గ్యాలరీల ఏర్పాట్ల పనులతో పాటు హెలిపాడ్ పనులు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. మంత్రి వెంట రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్కుమార్, మునిసిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, డీఆర్ఓ పుల్లయ్య, సర్పంచ్ శీలం చంద్రశేఖర్నాయుడు, ఎంపీటీసీ సభ్యులు జానకిరాముడు తదితరులు ఉన్నారు.
పకడ్బందీ బందోబస్తు
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తు చేపడుతున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ శామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్రెడ్డి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన ఏర్పాట్లపై డోన్ ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఆదివారం జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలంకొండ వద్ద హంద్రీనీవా కాల్వపై ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం డోన్లో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కొక్క విభాగానికి ఒక్కో ఉన్నతాధికారికి బాధ్యతలు అప్పగించామన్నారు. సీఎం పర్యటనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా హెలిపాడ్, సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ రెగ్యులేషన్, రూట్ బందోబస్తు, కాన్వాయ్ భద్రత లాంటి వాటిపై స్వయంగా అధికారులతో చర్చించి బాధ్యతలు అప్పగించినట్లు వారు వివరించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు.
సీఎం పర్యటనను విజయవంతం చేద్దాం
కృష్ణగిరి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనను అధికారులు సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సృజన ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్తోపాటు ఎస్పీ కృష్ణకాంత్, జేసీ నారపురెడ్డి మౌర్య, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆదివారం వేర్వేరుగా పరిశీలించారు. అనంతరం అధికారుల సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ హెలిపాడ్, పార్కింగ్, కాన్వాయ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, లిఫ్ట్ వద్ద విధులు నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులు, సిబ్బందిని నియమించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. హెలిపాడ్ నుంచి కిలో మీటరు దూరంలో ఎత్తిపోతల పథకానికి వచ్చే సీఎం కాన్వాయ్ మార్గంలో రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. వేదిక వద్ద గ్రీన్ రూంను ఏర్పాటు చేయాలని, పంప్హౌస్ భవనాన్ని ఆకట్టుకునే విధంగా ఆలంకరించాలని ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వర్షం వచ్చినా ఎలాంటి ఆటంకం లేకుండా హెలిపాడ్, పంప్హౌస్ వద్ద వాటర్ప్రూప్ టెంట్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఎస్ఈలు రెడ్డి శేఖర్రెడ్డి, నాగరాజు, సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ నారసరెడ్డి, డీపీఓ నాగరాజు నాయుడు, తహసీల్దార్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
డోన్, ఆలంకొండ వద్ద
ముమ్మరంగా పనులు
పర్యవేక్షిస్తున్న ఉమ్మడి జిల్లాల
ఉన్నతాధికారులు

డోన్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ

డోన్లో బహిరంగ సభా స్థలిలో విశాలమైన షెడ్

హెలిపాడ్ను సిద్ధం చేస్తున్న దృశ్యం