పచ్చ బంగారం సాగుకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

పచ్చ బంగారం సాగుకు శ్రీకారం

Jun 13 2025 7:15 AM | Updated on Jun 13 2025 7:15 AM

పచ్చ

పచ్చ బంగారం సాగుకు శ్రీకారం

కంకిపాడు: పచ్చబంగారం (పసుపు పంట) సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. తొలకరి పలకరింపులో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. పసుపు విత్తనం కొమ్ములు విరిచి, పొలంలో నాటేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ఈ ప్రాంతానికి అనువైన విత్తన రకాన్ని ఎంపిక చేసుకోవటంపై రైతులు దృష్టి పెడుతున్నారు.

వాణిజ్య పంటల్లో పసుపు పంట కూడా ముఖ్యమైంది. కృష్ణాజిల్లాలో 5031 ఎకరాలు, ఎన్టీఆర్‌ జిల్లాలో 707 ఎకరాల్లో పసుపు సాగుకు అనువైన భూములు ఉన్నాయి. సాధారణంగా కడప, మైదుకూరు, ప్రగతి, శీలం, ఎర్రశీలం, స్థానిక రకాలను రైతులు సాగుకు ఎంపిక చేసుకుంటారు. మేలైన దిగుబడులు, తెగుళ్ల బెడద తక్కువగా ఉండే విత్తన రకాలకు రైతులు ప్రాధాన్యం ఇస్తారు.

ముందుగానే పలకరించిన తొలకరి

ఈ ఏడాది తొలకరి ముందుగానే పలకరించింది. అడపాదడపా ఓ మోస్తరు వర్షాలు కురవటంతో భూములు అదునుకు వచ్చాయి. దీంతో రైతులు పొలాల్లో పూర్వ పంట తాలూకూ వ్యర్థాలను ఏరివేసి, రెండు దఫాలుగా దుక్కి దున్ని పసుపు విత్తనం నాటేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. పెనమలూరు, పామర్రు నియోజకవర్గాలతో పాటుగా దివిసీమ పరిధిలోని లంక భూముల్లో పసుపు సాగు చేపట్టేందుకు రైతులు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలో అనువైన విత్తనాలను సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఎకరం కౌలు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకూ ఒప్పందాలు చేసుకుని భూములను మాట్లాడుకుని సాగుపై దృష్టి పెడుతున్నారు.

పుట్టు రూ.5500–రూ 6500

రెండేళ్ల కిందటి వరకు పుట్టు(225 కిలోలు) ధర రూ.3500 మించి పలికేది కాదు. ఈ ఏడాది రూ.5500 నుంచి రూ.6500 పలుకుతోంది. పసుపు పంట చేతికి వచ్చే నాటికి ఫిబ్రవరి, మార్చి మాసంలో పచ్చి పసుపు కొమ్ములు పుట్టు రూ.3 వేల నుంచి రూ.4 వేల లోపే మార్కెట్‌లో ధర పలికింది. అలాంటిది ప్రస్తుతం రైతులు విత్తనం కోసం కొనుగోలు చేసే నాటికి ఆ ధర పెరుగుతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అమ్మబోతే అడవి... కొనబోతే కొరివి అన్న చందంగా తయారవుతోందంటూ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. అయినా చేసేదేమీ లేక సాగుకు అవసరమైన విత్తనం కొమ్ము ధర పెచ్చు అయినా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎండుకొమ్ములు ధర రూ.9,500 నుంచి రూ.11500 మధ్య నడుస్తోంది. గతేడాదితో పోలిస్తే రూ.14 వేలు మార్కు దాటుతుందని రైతులు ఆశించారు. అయినా ఆశించిన మేరకు ధర పెరగలేదు. అయితే ఈ దఫా రేటు పెరుగుతుందనే ఆశాభావంతో ఉన్నారు. దీంతో విత్తనం కొమ్ము సేకరించి సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. మరో పది రోజులు దాటితే విత్తనం కొమ్ముకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. ధర పెరిగే చాన్స్‌ ఉండటంతో ముందస్తుగానే విత్తనం సేకరించి నిల్వ చేసుకుని సాగుకు ఉపక్రమించేలా సన్నద్ధమవుతున్నారు.

ధర ఇంకా పెరిగే అవకాశం

పొలాలు అదునుకు రావటంతో

సాగు పనులు చేపట్టిన రైతులు

విత్తనం కొమ్ము సేకరణపై దృష్టి

తొలకరి పలకరింపుతో సాగులో

నిమగ్నం

పచ్చ బంగారం సాగుకు శ్రీకారం 1
1/1

పచ్చ బంగారం సాగుకు శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement