
కొనసాగుతున్న ఎస్జీటీల బదిలీలు
మచిలీపట్నంఅర్బన్: సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) బదిలీల నిమిత్తం ప్రభుత్వం నిర్వహిస్తున్న మాన్యువల్ కౌన్సెలింగ్ ప్రక్రియ మూడవ రోజు కొనసాగింది. గత రెండు రోజుల్లో 1,130 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సీనియారిటీ జాబితాలోని 701 నుంచి 1,150 వరకు ఉదయం సెషన్, 1,151 నుంచి 1,450 వరకు ఎస్జీటీలు మధ్యాహ్నం సెషన్లో హాజరై బదిలీ ఉత్తర్వులు పొందారు. బదిలీల ప్రక్రియ ఆర్జేడీ జి.నాగమణి పర్యవేక్షించారు. ఉపాధ్యాయుల అర్హతలు, ప్రాధాన్యతలు పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా బదిలీలు చేపడుతున్నామని చెప్పారు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో
నిండు ప్రాణం బలి
జంగారెడ్డిగూడెం: విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం నిండు ప్రాణా న్ని బలిగొంది. ఈ ఘటన గురువారం జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా భీమవరప్పాడుకు చెందిన కొమ్మి మన్మథశేఖర్ అనే కాంట్రాక్టర్ వద్ద ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామానికి చెందిన మధిరి నవీన్ (26) పనిచేస్తున్నాడు. మండలంలోని మైసన్నగూడెంలో విద్యుత్ లైన్ల పనుల నిమిత్తం గురువారం ఇద్దరు యువకులతో కలిసి నవీన్ వెళ్లాడు. పనులు ముగిసిన అనంతరం తిరిగి వస్తున్న సమయంలో లైన్మన్ సురేష్ లైన్ మరమ్మతు పని ఉందని చెప్పి నవీన్ను రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కించాడు. మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్ ప్రవహించడంతో నవీన్ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న డీఈ సుబ్బారావు, ఎస్ఐ జబీర్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేసి మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి డీఈ సుబ్బారావు మాట్లాడుతూ మరమ్మతుల నిమిత్తం ఎల్సీ తీసుకున్నారని, సమీప ఇళ్లల్లోని ఇండక్షన్ సప్లై రావడంతో ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిపారు.