నేరాల నియంత్రణకు కృషి చేయండి | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు కృషి చేయండి

Jun 12 2025 7:31 AM | Updated on Jun 12 2025 7:31 AM

నేరాల నియంత్రణకు కృషి చేయండి

నేరాల నియంత్రణకు కృషి చేయండి

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): జిల్లాలో నేరాల నియంత్రణకు మరింత కృషి చేయాలని ఎస్పీ ఆర్‌.గంగాధరరావు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారులతో ఎస్పీ బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా పోలీసులు ఉన్నారనే నమ్మకం కలిగించేలా చర్యలు ఉండాలని స్పష్టంచేశారు.

మహిళల రక్షణకు మరింత కృషి

మహిళలు, యువతులు, చిన్నారుల రక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. వారి నుంచి అందే ఫిర్యాదులను స్వీకరించిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని, తక్షణం విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాలని స్పష్టంచేశారు. ఆడబిడ్డల జోలికి వెళ్లాలంటే ఉన్మాదులు భయపడేలా పోలీసు చర్యలు ఉండాలని స్పష్టంచేశారు. శక్తి బృందాల ద్వారా జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, జన సంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రతి ఒక్కరు తమ సమస్యలపై ధైర్యంగా ఫిర్యాదు చేసేలా భరోసా ఇవ్వాలన్నారు.

రోడ్డు ప్రమాదాలను నివారించాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రదేశాలను గుర్తించి, సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయా లని సూచించారు. పెనమలూరు, గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం ట్రాఫిక్‌ సిబ్బందితో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేప ట్టాలని ఆదేశించారు. మద్యం తాగి వాహనాలు నడపకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సైబర్‌ నేరాల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామాల సందర్శన.. పల్లెనిద్ర

పోలీస్‌ అధికారులు అందరూ తమ తమ పరిధిలో కమ్యూనల్‌ అండ్‌ పొలిటికల్‌ సెన్సిటివ్‌ ఉన్న గ్రామాలను సందర్శించి అక్కడ శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గంగాధరరావు సూచించారు. ప్రతి పోలీసు అధికారి తమ స్టేషన్‌ పరిధిలో ఉన్న గ్రామాలను సందర్శించి పల్లెనిద్ర కార్యక్రమాలను చేట్టాలని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో నమోదైన కేసులపై సమీక్షించి కేసుల దర్యాప్తు వివరాలు, చార్జ్‌ షీట్‌ దాఖలు వంటి వివ రాలను అడిగి తెలుసుకున్నారు. కోర్టులో స్పీడ్‌ ట్రయల్‌ ద్వారా కేసులోని నిందితులకు శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. హత్య, రేప్‌ కేసులు, పోక్సో, ప్రాపర్టీ, గంజాయి, ఎస్సీ ఎస్టీ, గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసుల్లో దర్యాప్తుపై ఆరా తీశారు.

సిబ్బందికి అభినందనలు

మసుల బీచ్‌ ఫెస్టివల్‌ను విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. బందో బస్తును సమర్థంగా నిర్వహించటంలో అందరూ సఫలీకృతులయ్యారని కొనియాడారు. బందో బస్తులో సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీని జిల్లాలోని అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ బి.సత్యనారాయణ, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

సైబర్‌ నేరాలపై నిఘా పెట్టండి గ్రామాల సందర్శన తప్పనిసరి నేరసమీక్ష సమావేశంలో ఎస్పీ గంగాధరరావు

గంజాయిపై ఉక్కుపాదం

జిల్లాను గంజాయి రహితంగా మార్చడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. గంజాయి కేసులకు సంబంధించి నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఎన్‌డీపీఎస్‌ కేసుల్లో విచారణ వేగవంతం చేయడానికి ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చోరీల నివారణకు నైట్‌ బీట్‌ సంఖ్యను, సీసీఎస్‌ టీమ్స్‌ను కూడా నైట్‌ బీట్‌లకు పెంచాలని సూచించారు. బీట్‌ తిరిగే కానిస్టేబుళ్లు తమ పరిధిలో సస్పెక్ట్‌ షీట్‌ హోల్డర్లు, డీసీ షీట్‌, కేడీషీట్‌ హోల్డర్ల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement