
నదుల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా పరిధిలో అక్టోబర్ 15వ తేదీ వరకు నదుల్లో ఇసుక తవ్వకాలను నిషేధించామని కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. ఇసుక తవ్వకాలు, అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లా డుతూ.. నైరుతి రుతుపవనాల కాలంలో నదుల్లో ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రిబ్యూనల్ నిషేధించిందని తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం అక్టోబరు 15వ తేదీ వరకు నదుల్లో ఎక్కడా కూడా ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలని స్పష్టంచేశారు. నదీ తీర ప్రాంతాల వద్ద రాత్రిపూట నిఘా ఉంచి పోలీస్ గస్తీలు సజావుగా నిర్వహించాలన్నారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద సీసీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలన్నారు. నదులకు చేరే రహదారి మార్గంలో కందకాలను తవ్వించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ప్రతి ప్రాంతంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి అధికారులు నిత్యం పర్యవేక్షించేలా చూడాలన్నారు. ఆర్డీఓలు, డీఎస్పీలు తరచూ తనిఖీలు చేపట్టాలని సూచించారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణాపై ఉన్న నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామసభల్లో తీర్మానాల ప్రతిని సంతకాలతో జిల్లా కమిటీకి అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని శ్రీకాకుళం, నార్త్ వల్లూరు, రొయ్యూరు, మద్దూరు, చోడవరం, పడమటలంక, రొయ్యూరు సెమీ మెకనైజ్డ్ స్టాక్ యార్డుల్లో ప్రస్తుతం 7.50 లక్షల టన్నుల ఇసుక అందు బాటులో తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినా, వాహనాల్లో అక్రమంగా ఇసుక తరలించినా స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన ఏడు స్టాక్యార్డుల నుంచి మాత్రమే ఇసుకను తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సత్యనారాయణ, గనుల శాఖ డీడీ శ్రీనివాసకుమార్, భూగర్భజలశాఖ డీడీ విజయవర్ధనరావు, వాణిజ్య పన్నులశాఖ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఈఈ రవికిరణ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నటరాజ్, ఆర్టీవో శ్రీనివాసనాయక్ తదితరులు పాల్గొన్నారు.
అక్టోబరు 15వ తేదీ వరకు ఆంక్షలు తవ్వకాలు జరిపినా, రవాణా చేసినా కఠిన చర్యలు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ