
సమిధలవుతున్న వనితలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రోజుకో ప్రాంతంలో వారిపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలతో కలిసి మంగళవారం అవినాష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా, ఇచ్చిన హామీల అమలు శూన్యమన్నారు. తాము వెన్నుపోటు దినం ద్వారా నిరసన తెలిపితే కూటమి పాలకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
దారుణ రాజకీయాలు..
ఒక జర్నలిస్ట్ చానల్లో మాట్లాడితే దానిని వైఎస్ జగన్ కుటుంబానికి అంటగడుతూ విమర్శలు చేస్తున్నారన్నారు. కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసి కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారని దేవినేని అవినాష్ అన్నారు. గత ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం కల్పించామని, మహిళల పేరుతో అనేక పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. మహిళలు అంటే గౌరవంతో వైఎస్ జగన్ పాలన సాగించారన్నారు. అమరావతి ప్రాంతంలో పేద ప్రజలకు సొంతింటి కలను జగన్ నెరవేర్చారన్నారు. జగన్ చేసిన మంచి పనులను దమ్ముగా, ధైర్యంగా చెప్పగలమని, ఆయన గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, జాగ్రత్త అని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని, ఒక చానల్లో వచ్చిన దానికి కొమ్మినేని అప్పుడే క్షమాపణ చెప్పారని, ఆ మీడియా ఆఫీసుపై దాడి చేసి ధ్వంసం చేయడం దారుణమన్నారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
వరుస దారుణ ఘటనలతో బెంబేలు
డైవర్షన్ కోసమే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్
మీడియాతో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్