
అంతులేని అఘాయిత్యాలపై ఆందోళన
మచిలీపట్నంటౌన్: కూటమి పాలనలో రాష్ట్రంలోని బాలికలు, మహిళలకు రక్షణ కరువైందని.. రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయించి.. మహిళల మాన, ప్రాణాలను కాపాడేలా చూడాలని కోరుతూ వైఎస్సార్ సీపీ మహిళా ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ‘సేవ్ ఉమెన్– సేవ్ ఆంధ్రా’ అంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, బాలికలకు బాబు పాలనలో భద్రత కరువు అనే నినాదంతో కూడిన బ్యానర్, ఫ్లకార్డులతో ప్రధాన రహదారిలో నిరసన ర్యాలీ చేస్తూ స్థానిక లక్ష్మీటాకీస్ సెంటర్లోని అంబేడ్కర్ సర్కిల్కు చేరుకున్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని సమర్పించారు.
● గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్రాణి మాట్లాడుతూ కూటమి పాలన ప్రారంభమైన తర్వాత ప్రతి రోజూ ఏదోక చోట బాలికలు, మహిళలపై లైంగిక దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠినంగా శిక్షించకుండా రాజకీయ కక్షసాధింపు చర్యలకే పాలకులు చొరవ చూపుతున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని, మహిళా రక్షణను గాలికొదిలేసి కేవలం కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సన్నద్ధం అవుతున్నారన్నారు.
● బందరు మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అధికారులకు వినతులు ఇచ్చి చేతులు నొప్పులు పుట్టటం తప్ప ప్రయోజనం ఉండటం లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిలుపుదల చేసేందుకు అంబేడ్కర్ రాజ్యాంగం అమలు అయ్యేలా చూడండని ఆయన విగ్రహానికే వినతి పత్రాన్ని ఇచ్చామన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో నగర మాజీ డెప్యూటీ మేయర్ తంటిపూడి కవిత, కార్పొరేటర్లు షేక్ షాహినా, రాసంశెట్టి వాణిశ్రీ, పడమట రేవతి తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు.
కూటమి పాలనపై వైఎస్సార్ సీపీ మహిళా ప్రజాప్రతినిధులు, కార్యకర్తల నిరసన
అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పణ