
సత్వర పరిష్కారమే లక్ష్యం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీవో కె. స్వాతి అర్జీలు స్వీకరించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను కిందిస్థాయి సిబ్బందితో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. మీకోసంలో అధికారులు 105 అర్జీలను స్వీకరించారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
● బందరు మండలం సుల్తానగరం గ్రామంలో అక్రమంగా ఏర్పాటు చేసిన కుళాయిలపై విచారణ జరిపి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుతూ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మురాల దేవి అర్జీ ఇచ్చారు. అలాగే గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారని, వాటి మార్జిన్లు ఏర్పాటు చేయలేదని దీని కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అర్జీలో వివరించారు.
● బందరు మండలం చిన్నాపురం గ్రామంలో సర్వే నంబరు 101 నుంచి 104 నంబర్లు గల భూమిలో టీడీపీ నాయకులు 23 ఎకరాల పంచాయతీ చెరువును రొయ్యల చెరువుగా మార్చేసి లీజుకు ఇచ్చి ఆ డబ్బులను పంచాయతీకి చెల్లించటం లేదు. ఇప్పటి వరకు సుమారుగా రూ. 1.50 కోట్లు పంచాయతీకి జమ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. అలాగే గ్రామంలో రామాలయం, చర్చి ఉన్న ప్రాంతంలో బ్రాందీషాపును ఏర్పాటు చేసి ఆ బ్రాందీషాపునకు రూ. 20 లక్షల ప్రభుత్వ నిధులతో రోడ్డు నిర్మించారు. వీటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సైకం కోటేశ్వరరావు అర్జీ ఇచ్చారు.
డీఆర్వో చంద్రశేఖరరావు ‘మీ కోసం’లో 105 అర్జీలు స్వీకరణ