
వెబ్ కౌన్సెలింగ్ లోపభూయిష్టం
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల బదిలీల్లో ఫైనల్ సీనియారిటీ జాబితాలు రాకుండానే పీఎస్ హెచ్ఎంలకు పాఠశాలల కేటాయింపు అనేది సరికాదని, ఇది వెబ్ కౌన్సెలింగ్లోని లోపభూయిష్ట విధానమని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు విమర్శించారు. సోమవారం వెబ్ కౌన్సెలింగ్పై ఉపాధ్యాయులు చేస్తున్న ఉద్యమంలో భాగంగా రెండో రోజు స్థానిక ధర్నాచౌక్ వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రీవెన్స్ పరిష్కారం కాకుండానే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని అధికారులు ఒత్తిడి చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. లోపభూయిష్టమైన వెబ్ కౌన్సిలింగ్ వల్లే జూనియర్లకు పోస్టులు కేటాయింపు జరిగి సీనియర్ల అన్యాయం జరిగిందన్నారు. విద్యాశాఖ రోజుకు 500 మందితో జరపాలనుకునే కొత్త వెబ్ కౌన్సెలింగ్ అంతేమందితో మాన్యూవల్గా జరపటానికి అభ్యంతరం ఏమిటో అర్థం కావట్లేదన్నారు.
మంత్రి లోకేష్ స్పందించాలి..
ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి మాన్యూవల్ కౌన్సిలింగ్ కు హామీ ఇచ్చిన విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ ఉపాధ్యాయ ఉద్యమం, ఆందోళనను ఉద్దేశించి స్పందించాలన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు టీచర్లు చేస్తున్న ఆందోళనకు సానుకూల ప్రకటన విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో మంగళవారం భారీ ఎత్తున ఉపాధ్యాయులతో విద్యా భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీయూఎస్, వైఎస్ఆర్టీఎఫ్, ఎస్టీఎఫ్, పీఈటీ అసోసియేషన్, ఎస్ఆర్టీఎఫ్, ఎన్టీఏ, ఎస్సీ, ఎస్టీ యూనియన్ తదితర సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజు ఆందోళనలో ఉపాధ్యాయులు