
విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల అందజేత
చిలకలపూడి(మచిలీపట్నం): కృషి, పట్టుదలతో ఉన్నతస్థాయికి చేరుకునేందుకు శ్రమించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. 2024–25 విద్యాసంవత్సరంలో ఇంటర్మిడియెట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సోమవారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో షైనింగ్ స్టార్స్ అవార్డులను బహూకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎంతో మంది కృషి, పట్టుదలతో గొప్ప విజయాలను అందుకున్నారని అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాలను సాధించాలన్నారు. ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ ఇంటర్మీడియెట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గుర్తించి వారిని ఉన్నత లక్ష్యాల వైపు పయనించేలా ప్రోత్సాహం అందించటమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమన్నారు. జేసీ గీతాంజలిశర్మ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రుల నిర్ణయాలు కాకుండా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అవకాశాలను పరిశీలించుకుని సొంత నిర్ణయాలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం 201 మంది విద్యార్థులకు అవార్డులు అందజేశారు. గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, డీఈవో పీవీజే రామారావు, ఆర్ఐవో సాల్మన్రాజు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.