
రూ.13,500 కోట్ల టర్నోవర్ కేడీసీసీబీ లక్ష్యం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఈ ఏడాది రూ.13,500 కోట్లు టర్నోవర్ సాధించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. చైర్మన్గా బాధ్యతలను స్వీకరించిన అనంతరం తొలిసారిగా మచిలీపట్నం కేంద్ర కార్యాలయానికి శుక్రవారం ఆయన విచ్చేశారు. బ్యాంకులో ఉన్న వివిధ విభాగాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు.
అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఆయా విభాగాలు ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేలా తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం బ్యాంకు ద్వారా ఉమ్మడి జిల్లాలో 7,500 డ్వాక్రా సంఘాలకు రుణాలను అందజేస్తున్నామని తెలిపారు. పదివేల డ్వాక్రా సంఘాలకు రూ.20 లక్షలు వరకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతాంగానికి ఇప్పటి వరకు రూ.1,500 కోట్లు పంట రుణాలను అందజేస్తున్నామని, దీనిని రెండు వేల కోట్లు రూపాయాల వరకు పెంచేలా ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయేతర రుణాలు ఈ ఏడాదిలో రూ.200 కోట్లు వరకు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. బంగారు ఆభరణాలపై రూ.900 కోట్లు వరకు రుణాలు ఇచ్చామని, దీనిని రూ.1500 కోట్లు వరకు పెంచేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. బ్యాంకు ద్వారా ఇప్పటి వరకు రూ.3,200 కోట్లు వరకు డిపాజిట్లు సేకరించామని పేర్కొన్నారు. దీనిని మరో రూ.500 కోట్లుకు పెంచేలా ఆలోచన చేస్తున్నామని వివరించారు. నెలాఖరులోగా జనరల్బాడీ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. కేడీసీసీ బ్యాంకు సీఈవో ఎ.శ్యామ్మనోహార్, జనరల్ మేనేజర్లు బీఎల్ చంద్రశేఖర్, టి.వీరబాబు, జగ్గయ్యపేట టీడీపీ మండల అధ్యక్షుడు కట్టా వెంకట నరసింహారావు పాల్గొన్నారు.
చైర్మన్ నెట్టెం రఘురాం