
యోగా సాధనతో రుగ్మతలు దూరం
పెదపూడి(మొవ్వ):యోగా సాధనతో రుగ్మతలకు దూరంగా ఉండటంతో పాటు మానసిక ఉల్లాసం పొందవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. యోగాంధ్ర–2025లో భాగంగా శుక్రవారం ఉదయం మొవ్వ మండలం పెదపూడి గ్రామంలోని జిమ్ ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ కుటుంబసభ్యులతో పాటు స్థానిక శాసనసభ్యులు వర్ల కుమార్రాజా, జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలతో పాటు సామూహిక యోగాసనాలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి యోగా శిక్షకులు రెబ్బా పోతన శాస్త్రి ఆసనాలు వేసే విధానాన్ని చూపుతూ ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం వారి చేత యోగాసనాలు వేయించి యోగ ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలను కూచిపూడి నృత్య ఆకృతిలో కూర్చోబెట్టి ఆసనాలు నిర్వహించటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. తాను నిత్యం యోగా సాధన చేస్తూ శారీరక, మానసిక ఆరోగ్యం
పెంపొందించుకున్నానని వెల్లడించారు. పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ యోగా విశిష్టతను గ్రహించానని, ఇక నుంచి ప్రతిరోజు సాధన చేస్తానన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన యోగ అతి ప్రాచీనమైన విద్య అని వివరించారు. రోజూ యోగా సాధన కోసం కొంత సమయాన్ని కేటాయించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. అనంతరం యోగా శిక్షకులు, కూచిపూడి నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులు, నాట్య గురువు డాక్టర్ వేదాంత రాదే శ్యామ్ తదితరులను జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్
కలెక్టర్ శాలువాతో సత్కరించి అభినందించారు.
స్టాల్ ప్రారంభం...
కూచిపూడి గ్రామాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరచడంతో పాటు ఆదాయ వనరులను పెంపొందించడంలో భాగంగా, గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు కూచిపూడి నాట్యకళకు అవసరమైన నాట్య
వస్త్రాలు, గజ్జెలు, జడలు, గిల్టు నగలు తదితర వస్తువులను తయారు చేసి జిమ్ ప్రాంగణంలో ప్రదర్శనగా ఉంచిన స్టాల్ను కలెక్టర్ ప్రారంభించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి వారితో ముచ్చటించారు. తయారు చేసిన వస్తువులను అమ్ముకునేందుకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ను కోరారు. డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఏపీ పర్యాటక శాఖ ఏడీ లజ్వంతి నాయుడు, ఉయ్యూరు ఆర్డీవో బీఎస్ హేలా షారోన్, గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, జిల్లా పర్యాటక శాఖ అధికారి జి.రామలక్ష్మణరావు, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, తహసీల్దార్ మస్తాన్, ఎంపీడీవో విమాదేవి, ఆయుష్ తదితర శాఖల అధికారులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

యోగా సాధనతో రుగ్మతలు దూరం