హత్యచేశారని చెబుతున్న మృతుడి బంధువులు
కారు ప్రమాదంలో మృతి చెందాడంటున్న పోలీసులు
కాచవరం(ఇబ్రహీంపట్నం): అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని కాచవరం గ్రామంలో కలకలం సృష్టించింది. గురువారం రాత్రి ఇందిరమ్మ కాలనీకి వెళ్లే రోడ్డులో జరిగిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. మృతుడు పడిఉన్న పరిస్థితిని బట్టి హత్య చేసినట్లు స్థానికులు భావించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన నడకుదిటి ఏసుబాబు(28)గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన కారణాలపై పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమేరాల పుటేజీ పరిశీలించారు.
ఏసుబాబు అద్దె గూడ్స్ ఆటో నడుపుతూ జీవిస్తాడు. రాత్రి 11గంటల తర్వాత ఇందిరమ్మ కాలనీ రోడ్డులో ఏసుబాబు నడుచుకుంటూ వెళుతున్నట్లు పోలీసులు సేకరించిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. అ సమయంలో ఏసుబాబును దాటుకుంటూ నలుపు రంగు కారు రోడ్డుపై దూసుకెళ్లింది. కొద్ది నిమిషాల వ్యవధిలో వెనుకకు మళ్లిన నలుపు రంగకారు రోడ్డుపై లైట్లు ఆర్పేసి కొద్దిసేపు ఆగింది. తర్వాత కారు వేగంగా దూసుకుని హైవే వైపు వెళ్లిపోయింది. కారు లైట్లు తీసేసి ఆగిన ప్రాంతంలో యువకుడి మృతదేహం పడి ఉండటాన్ని బట్టి హత్య చేశారనే అనుమానం కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
నెలరోజుల క్రితం ఏసుబాబుకు మరో కుటుంబానికి గొడవలు జరిగాయి. పాతకక్షల నేపథ్యంలో హత్యచేసి ఉంటారని చెబుతున్నారు. అయితే పోలీసులు కారు ప్రమాదంలో ఏసుబాబు మృతి చెందినట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడితే నిజానిజాలు బయటకు వస్తాయని ప్రజలు, మృతుడి బంధువులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.