
యనమలకుదురు ఇసుక క్వారీ వద్ద ఉద్రిక్తత
పెనమలూరు:యనమలకుదురు ఇసుక క్వారీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. క్వారీలోకి ఇసుక మాఫియా ప్రవేశించి విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టడంపై వివాదం తలెత్తింది. దీంతో లంక భూముల సొసైటీ సభ్యులకు ఇసుక తవ్వకాలు చేసే మాఫియాకు గురువారం రాత్రి గొడవ జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో గ్రామస్తులు ఘాట్ గేటుకు తాళాలు వేశారు. యనమలకుదురులో ఇసుక క్వారీని గత 20 సంవత్సరాల క్రితమే నిషేధించారు. ఈ క్వారీ కనకదుర్గ వారధికి కేవలం 2 కిలోమీటర్ల లోపు దూరం మాత్రమే ఉంది. ఇసుక క్వారీలో ఇసుక తవ్వకాలు చేస్తే వారధికి ప్రమాదం ఉంటుందని ఇసుక తవ్వకాలు అధికారికంగా నిలిపివేశారు. దీంతో యనమలకుదురు ఇసుక క్వారీకి వేలంపాటలు పెట్టలేదు. ఇసుక మాఫియానే అక్రమంగా నదిలోకి ప్రవేశించి తవ్వకాలు చేస్తున్నారు. నిషేధ యనమలకుదురు క్వారీలో చట్ట విరుద్ధంగా ఇసుక తవ్వకాలు విపరీతంగా చేస్తున్నారు. ఇసుక మాఫియా నదిలోకి చొచ్చుకు పోయి ఇసుక తవ్వకాలు చేయటం పై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణానదికి వరద వస్తే నిర్మించిన వాల్కు కూడా ప్రమాదం ఏర్పడే సరిస్థితి ఉంది. అలాగే కనకదుర్గ వారధికి సైతం రక్షణ ఉండదు. ఇక్కడ ఇంత తంతు జరుగుతున్నా ఏ ఒక్క అధికారి కూడా చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియాతో అధికారులు చేతులు కలిపారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెదపులిపాక ఇసుక క్వారీని మూసివేయటంతో ఇసుక ట్రాక్టర్లు ఒక్కసారిగా యనమలకుదురు క్వారీలోకి వచ్చాయి. సొసైటీ సభ్యులకు ఇసుక మాఫియాకు గొడవలు జరగటంతో ఉద్రిక్తత నెలకొంది. వివాదం ముదురుతుందని గ్రామస్తులు ఘాట్ గేటుకు తాళం వేశారు. అధికారులు ఇప్పటికై నా కళ్లు తెరిచి యనమలకుదురులో ఇసుక తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.