
దుర్గాఘాట్లో పనులు పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దుర్గాఘాట్ శుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ విభాగాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ తెలిపారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే దుర్గాఘాట్ను శుక్రవారం ఈవో శీనానాయక్ తనిఖీ చేశారు. దుర్గాఘాట్ను చూసి భక్తులు కొండపై పరిశుభ్రతను అంచనా వేస్తున్నారని, ఘాట్ ఎంత శుభ్రంగా ఉంటే ఆలయమంత పరిశుభ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఘాట్ను పరిశుభ్రంగా ఉంచటంతో పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. భక్తులు దుస్తులు మార్చుకునే గదులు, టాయిలెట్స్, సూచిక బోర్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నదిలో భక్తులు సబ్బులు, షాంపులు వినియోగించకుండా చూడాలని తెలిపారు. సబ్బులు, షాంపులు వినియోగించడం వల్ల నదీ జలాలు కలుషితం కావడమే కాకుండా నదిలో జీవరాశులు చనిపోతాయని తెలిపారు. దుర్గాఘాట్లో మైక్ ప్రచార కేంద్రం ఏర్పాటు చేసి, తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హాకర్లు తమ పరిధి దాటి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. టాయిలెట్స్తో పాటు భక్తులు మరుగుదొడ్ల వద్ద కాళ్లు కడిగిన నీళ్లు తిరిగి స్నానఘాట్లోకి చేరకుండా చేపట్టిన పనులను ఏఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈవో శీనానాయక్కు వివరించారు. కృష్ణానది పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.