
వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శనివారం సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి కల్యాణోత్సవాన్ని జరిపించారు. తొలుత స్వామి వారి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాలతో కల్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేదికపై ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న ఉభయదాతలు, భక్తులకు ఆలయ అర్చకులు తలంబ్రాలను అందజేశారు. కల్యాణోత్సవం అనంతరం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఆలయానికి తరలించగా, భక్తులు, ఉభయదాతలు సేవలో పాల్గొన్నారు. అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.