
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
గుడ్లూరు: ముందు వెళ్తున్న ట్రాలీని వెనుక నుంచి ఆటో ఢీకొట్టడంతో ఓవ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన 16వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి గుడ్లూరు మండలంలోని తెట్టు ఫ్లైఓవర్ వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ వి.వెంకట్రావు కథనం మేరకు..విజయవాడలో కృష్ణలంకకు చెందిన పక్కెళ్ల శ్రీనివాసరావు(48) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. ఆటోలో ఫర్నీచర్ సామగ్రిని నెల్లూరు జిల్లా కలిగిరిలో దించి తిరుగు ప్రయాణమయ్యాడు.ఈక్రమంలో తెట్టు ఫ్లైఓవర్ వద్ద యంత్రాలతో వెళ్తున్న ఓ ట్రాలీ లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈఘటనలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.