
దేవాలయాల్లో భక్తులకు భద్రత కరువు
గుణదల(విజయవాడ తూర్పు): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేవాలయాల్లో భక్తులకు భద్రత కరువైందని, కేవలం ఆదాయంపైనే యావ తప్ప భక్తుల రక్షణ చర్యల గురించి పట్టించుకోవటం లేదని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సాయిరామ్ విమర్శించారు. గుణదలలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాల ఆదాయంపై ఉన్న దృష్టి భక్తులకు భద్రత కల్పించే విషయంలో లేకుండా పాలకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. బుధవారం సింహాచలం దేవస్థానంలో తొక్కిసలాట ఘటన, గతంలో తిరుమలలో చోటుచేసుకున్న తోపులాట ఘటనలు ఇందుకు నిదర్శనమన్నారు. కేవలం దేవదాయ శాఖ అధికారులు, కూటమి నాయకుల నిర్లక్ష్యం కారణంగానే భక్తులు మృత్యువాత పడుతున్నారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే దేవాలయాల కూల్చివేత, విగ్రహాల ధ్వంసం వంటి దుర్ఘటనలను చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. దేవుని విషయంలో అపరాధం చేస్తున్న వారికి దేవుడే తగిన బుద్ధి చెబుతాడని అన్నారు. ఇకనైనా దేవదాయ శాఖ భక్తులకు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లీగల్ సెల్ నాయకులు పాల్గొన్నారు.