
గొంతు తడిపేలా..!
● తాగునీటి సమస్యలపై పోలీసుశాఖ దృష్టి ● మారుమూల గ్రామాల్లో బోర్లు వేయిస్తున్న వైనం ● కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువ
సాక్షి, ఆసిఫాబాద్: పోలీసులపై ఉన్న ప్రతికూల అభి ప్రాయాలు తొలగించడంతోపాటు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా పోలీసుశాఖ ఇటీవల ‘సామాజిక’ పోలీసింగ్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో మారుమూల గ్రా మాల్లో తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. వేసవి తీవ్రతతో నీటి వనరులు కనుమరుగవుతున్న నేపథ్యంలో బోర్లు వేయిస్తూ నీటి గోస తీరుస్తున్నారు. గతేడాది జూన్ 20న జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న డీవీ శ్రీనివాసరావు త్వరితగతినే జిల్లా పరిస్థితులపై ఆధ్వయనం చేశారు. చట్టాలను కఠినంగా అమలు చేస్తూనే పోలీ సుశాఖలో జవాబుదారీతనం, పారదర్శకత తీసుకొచ్చారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజల మన్ననలు చూరగొన్నారు. దేశంలోనే రెండో వెనుకబడిన జిల్లా అయిన కుమురంభీం ఆసిఫాబాద్లో మారుమూల తండాలు, గూడేల్లో నివసిస్తున్న గిరిజ నులకు వైద్యసేవలు అందించడం, వృద్ధులకు దు ప్పట్లు, యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా అవగా హన కార్యక్రమాలు, వారికి క్రీడా పరికరాల పంపి ణీ.. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో కుట్టుమిషన్లు పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.
సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం
జిల్లావ్యాప్తంగా పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా గతేడాది డిసెంబర్ 19న బెజ్జూర్ మండలం నాగవెళ్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు దుప్పట్లు, యువతకు వాలీబాల్ కి ట్లు పంపిణీ చేశారు. డిసెంబర్ 24న జైనూర్ మండ ల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ఆదివాసీ మ హిళలకు చేతన ఫౌండేషన్ సహకారంతో 35 కుట్టు మిషన్లు అందించారు. డిసెంబర్ 29న తిర్యాణి మండలం మంగీ గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహణతోపాటు 500 మందికి దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్ను పంపిణీ చేశారు. ఈ ఏడాది మార్చి 12న జైనూర్లో కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్ వారి సహకారంతో మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందించారు. జిల్లాస్థాయిలో యువత కోసం కౌటాల పోలీసు స్టేషన్ వేదికగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించగా 64 టీంలు పాల్గొనడం విశేషం. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఆసిఫాబాద్ పట్టణంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 16 నుంచి రోజూ సుమారు 500 మందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేపట్టారు. ప్రతీ మండల కేంద్రంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయించారు.
పోలీసుల బాధ్యత
చట్టాలు అమలు చేయడమే కాకుండా ప్రజల భద్రత.. వారి జీవనాన్ని మెరుగుపరచడానికి పోలీసులు కృషి చేయాలి. అది తమ బాధ్యతగా గుర్తించాలి. జిల్లాలో తాగునీటి సమస్య ఉన్న కొన్ని గ్రామాలు నా దృష్టికి రావడంతో అక్కడ బోర్లు వేయించే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల నీళ్లు పడకపోయినా.. మళ్లీ ప్రయత్నించేందుకు చర్యలు చేపట్టాం. కమ్యూనిటీ పోలీసింగ్ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. సామాజిక సేవలో భాగంగా జిల్లాలో మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజల జీవన విధానాన్ని మెరుపర్చేందుకు అవసరమైన సహకారం అందిస్తున్నాం.
– డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ
దాహార్తిని తీరుస్తూ..
తాగునీటి సమస్యలతో జిల్లాలోని కొన్ని మారుమూల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా పెంచికల్పేట్ మండలం కోయచిచ్చాల గ్రామంలో మంచినీటి సమస్యను పోలీసులు పరిష్కరించారు. సిర్పూర్(యూ) మండలం రుద్రకస గ్రామంలోనూ తాగునీటి సమస్యను గుర్తించి బోరు వేయించారు.

గొంతు తడిపేలా..!