
జొన్నల కొనుగోలు కోసం రాస్తారోకో
రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో పండించిన జొన్నలను కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం సింధనూరులో రైతు సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది రైతులతో కలిసి చేపట్టిన రాస్తారోకోను ఉద్దేశించి సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ మాట్లాడారు. అధికారులు ఉన్నఫళంగా కొనుగోలు కేంద్రాలను బంద్ చేసి జొన్నల కొనుగోళ్లను నిలిపివేయడాన్ని తప్పుబట్టారు. రైతులు మార్కెట్కు తెచ్చిన జొన్నలు కొనుగోలు చేయాలని విన్నవించినా అధికారులు బేఖాతరు చేశారన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు లేకపోవడం, ఆ కేంద్రాలను మూసివేయడాన్ని ఖండించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు
ఓపీఎస్ కల్పించాలి
రాయచూరు రూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ వ్యవస్థ(ఓపీఎస్)ను కల్పించాలని అఖిల కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల వేదిక అధ్యక్షుడు జై కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు వ్యతిరేకంగా ఉందన్నారు. పాత పింఛన్ పద్ధతికి బదులుగా నూతన పింఛన్ పద్ధతి అమలుతో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11 లక్షల ఉద్యోగాలను నేరుగా భర్తీ చేయాలని కోరారు.
అనుచిత వ్యాఖ్యలపై నిరసన
బళ్లారిఅర్బన్: కన్నడ భాషను అవమానిస్తూ మాట్లాడిన తమిళ నటుడు కమల హాసన్ సినిమా థగ్లైఫ్ను రాష్ట్రంలో విడుదల చేయరాదని కన్నడ రక్షణ వేదిక నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం రాయల్ సర్కిల్లో వేదిక శివరామగౌడ బణ జిల్లాధ్యక్షుడు కురిహట్టి రాజశేఖర్ ఆధ్వర్యంలో డాక్టర్ మహేశ్వర స్వామి, కరవే పదాధికారులు పాల్గొని నిరసన తెలిపారు. కన్నడ భాషను అవమానించిన కమల హాసన్ తక్షణమే కన్నడిగులకు క్షమాపణ చెప్పాలన్నారు. కరవే పదాధికారులు కట్టిగె సూరి, సుంకన్న పాల్గొన్నారు.
రాయచూరు రూరల్: తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని సినీ నటుడు కమల హాసన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కరవే ఆందోళన చేపట్టింది. ఆదివారం రంగమందిరం వద్ద చేపట్టిన ఆందోళనలో కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడారు. నటుడు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. కాగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ నటుడి చిత్రపటంపైకి కరవే కార్యకర్తలు గుట్కాను ఉమ్మి తమ నిరసన తెలిపారు.
ఉపాధ్యాయులను
పర్మినెంట్ చేయాలి
రాయచూరు రూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలకు కమిషనరేట్తో పాటు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సంఘం జిల్లాధ్యక్షుడు శ్రీశైల నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నవోదయ, మొరార్జి దేశాయి, రాణి కిత్తూరు చెన్నమ్మ, మైనార్టీ పాఠశాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసి, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. జీఎఫ్, పీఎఫ్లను కూడా మంజూరు చేయాలని కోరారు.
కన్నడ భాషను ప్రోత్సహించాలి
రాయచూరు రూరల్ : నగర, పట్టణ ప్రాంతాల్లో కన్నడ భాషను ప్రోత్సహించాలని కరవే అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ పిలుపునిచ్చారు. ఆదివారం కన్నడ భవనంలో కన్నడ భాష కార్యకర్తల శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. భాషలో నేటికీ తెలుగు, కన్నడలు కలిపి వ్యాఖ్యానించడం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. తహసీల్దార్ సురేష్ వర్మ, జైలర్ అనిత, వీర హనుమాన్, మ్యాదర్, బషీరుద్దీన్ హొసమని, కృష్ణ, నిజాముద్దీన్, రామలింగప్పలున్నారు.

జొన్నల కొనుగోలు కోసం రాస్తారోకో

జొన్నల కొనుగోలు కోసం రాస్తారోకో

జొన్నల కొనుగోలు కోసం రాస్తారోకో

జొన్నల కొనుగోలు కోసం రాస్తారోకో