
టెన్త్ ఉత్తీర్ణత అంతేనా?
శివాజీనగర: ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షల్లో 60 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత పొందిన జిల్లాల డీడీపీఐలకు నోటీసులు ఇచ్చి, చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీష్ను ఆదేశించారు. శనివారం విధానసౌధలో జరిగిన రాష్ట్ర ప్రగతి పరిశీలన సభలో అన్ని జిల్లాధికారులు, జడ్పీ సీఈఓలతో సీఎం మాట్లాడారు. ఎక్కువ జిల్లాల్లో ఫలితాలు ఎందుకు తగ్గాయో డీడీపీఐలు ఇచ్చే సమాధానం సబబుగా లేకపోతే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎస్ఎస్ఎల్సీలో ఉత్తీర్ణత తగ్గడంపై ఆగ్రహించారు.
జిల్లా కేంద్రాల్లో కూర్చోవద్దు
ఉపాధ్యాయుల కొరత, సిబ్బంది కొరత అని నెపం చెప్పరాదని ఘాటుగా సీఎం హెచ్చరించారు. డీడీపీఐలు, జిల్లా ఇన్చార్జ్ కార్యదర్శులు పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులు సరిగా పనిచేస్తున్నారో, లేదో పరిశీలించాలి. శ్రద్ధతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని అన్నారు. డీడీపీఐలు జిల్లాల్లో కూర్చోకుండా అంతటా పర్యటిస్తూ ఉండాలని తెలిపారు. పాఠశాలల నూతన గదుల నిర్మాణం పూర్తి కాకపోవడంపై జిల్లాధికారులను ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల అడ్మిషన్లు తగ్గరాదు, డ్రాపవుట్లు పెరగరాదని ఆదేశించారు. దీనికి తగిన చర్యలను తీసుకోవాలన్నారు. ప్రభుత్వం పిల్లలకు గుడ్డు, పాలు, రాగిమాల్ట్, హాస్టల్ సదుపాయం అన్నిటిని ఇచ్చినా కూడా ఎందుకు బడుల్లో చేరడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చారు.
బాల్య వివాహాలపై
ఎస్సీ ఎస్టీలు, బీసీలు, పేదల జనాభా ఎక్కువగా ఉన్నచోట్ల బాల్య వివాహాలు, బాల గర్భిణీ కేసులు ఉంటాయి. దీనిని తప్పకుండా అరికట్టాలని సీఎం చెప్పారు. నిఘా వహించి, రిపోర్ట్ ఇవ్వని పీడీఓలు, రెవెన్యూ సిబ్బంది విరుద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
డీడీపీఐలు, ఉపాధ్యాయులకు శ్రద్ధ లేదా!
కలెక్టర్ల భేటీలో సీఎం సిద్దు మండిపాటు