
కసాప సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహిద్దాం
● మాజీ ఎమ్మెల్యే
గాలి సోమశేఖరరెడ్డి
సాక్షి,బళ్లారి: బళ్లారి జిల్లాలో 68 సంవత్సరాల తర్వాత జరగనున్న అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళననాన్ని ఘనంగా నిర్వహిద్దామని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. కసాప బళ్లారి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాలి రుక్మిణమ్మ, చెంగారెడ్డి కామర్స్ కాలేజీలో తల్లిదండ్రుల పేరుమీదుగా గురువారం ఏర్పాటు చేసిన స్మారక దత్తి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కన్నడ నేల, నీరు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు. కన్నడ భాషాభివృద్ధికి కసాప చేస్తున్న కృషి శ్లాఘనీయమన్నారు. మాతృభాషను, పుట్టిన నేలను ఎప్పుడూ మరవకూడదని సూచించారు. కన్నడ కస్తూరి పరిమళాన్ని నలుదిశలా ప్రసరింపజేయడానికి అఖిలభారత భారత కన్నడ సమ్మేళాన్ని కన్నుల పండువగా నిర్వహించాలన్నారు. ఆ సమ్మేళనం బళ్లారిలో సువర్ణాక్షరాలతో లిఖించేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కొట్టూరుస్వామి బీఎడ్ కళాశాల సహప్రాధ్యాపకులు ఎన్ జీ జయణ్ణ మాట్లాడుతూ ప్రాచీన కన్నడ సాహిత్యం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో కసాప జిల్లాధ్యక్షుడు నిష్టిరుద్రప్ప, మహానగర పాలికె విపక్ష నాయకుడు, కార్పొరేటర్ ఇబ్రహీంబాబు, కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.